Pope Francis Died : పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు. సోమవారం ఉదయం పోప్ మరణించారని వాటికన్ వర్గాలు ప్రకటించాయి. పోప్ తన జీవితమంతా చర్చి సేవకు అంకితమయ్యారని వెల్లడించాయి.
1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన ఆయన, 2013లో 266వ పోప్గా నియమితులయ్యారు. లాటిన్ అమెరికా దేశాల నుంచి పోప్గా నియమితులైన తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. పోప్ ఫ్రాన్సిస్ పేదల పట్ల ఎంతో దయతో ఉండేవారు. ఆయన పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శించేవారు, వాతావరణ మార్పుల పట్ల ఆందోళన వ్యక్తం చేసేవారు.
చిన్నప్పుడే ఊపిరితిత్తుల్లోని ఓ భాగాన్ని తొలగింపు
వాస్తవానికి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఫ్రాన్సిస్ యువకుడిగా ఉన్నప్పుడే ఆయన ఊపిరితిత్తుల్లోని ఓ భాగాన్ని తొలగించారు. 2025 ఫిబ్రవరిలో ఆయన శ్వాసకోశ సమస్యలతో జెమెల్లి ఆసుపత్రిలో చేరారు. అది డబుల్ న్యుమోనియాగా మారింది. ఆయన 38 రోజులపాటు ఆసుపత్రిలోనే ఉండి, తరువాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే తన అధికారిక నివాసానికి వెళ్లడానికి ముందు ఆనవాయితీ ప్రకారం, పోప్ ఫ్రాన్సిస్- సెయింట్ మేరీ మేజర్ బాసిలికాకు వెళ్లి ప్రార్థనలు చేశారు. ఈ ఏప్రిల్ 20న (ఆదివారం) ఆయన ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులకు సందేశం కూడా ఇచ్చారు. కాగా ఇప్పుడు 88 ఏళ్ల వయస్సులో ఆయన మరణించారు.
పోప్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం ఈస్టర్ సందర్భంగా చాలా రోజు తర్వాత ఆయన ప్రజల్లోకి వచ్చారు. దాదాపు నెల రోజుల పాటు ఆసుపత్రి చికిత్స తర్వాత పోప్ మార్చి 24న తన నివాసం కాసా శాంటా మార్టాకు తిరిగి వచ్చారు. ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన తరువాత తనను చూడాటానికి వచ్చిన ప్రజలకు కూడా ఆయన ఆశీర్వాదం అందించారు.
శరణార్థుల పాదాలు కడిగిన పోప్
తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థులకు పాదాలు కడిగారు. దీనిని ఆయన వినయం, సేవాతత్పరతకు చిహ్నంగా భావించేవారు. తదుపరి పోప్ను రహస్య ఓటింగ్ ద్వారా కార్డినల్స్ కాలేజ్ ఎన్నుకోనుంది.
భారత పర్యటన వేళ..
వాస్తవానికి పోప్ ఈ ఏడాది భారత్లో పర్యటించాల్సి ఉంది. కాథలిక్ చర్చి జూబ్లీ ఇయర్ వేడుకల కోసం ఆయన భారత్కు రావాల్సి ఉంది. గతేడాది డిసెంబర్లో కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ ఆయన్ను ఆహ్వానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినిధి బృందం స్వయంగా ఆయన్ను కలిసింది. అయితే పోప్ అనారోగ్యం కారణంగా ఆ షెడ్యూల్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆయన కన్నుమూశారు.