Modi on Russia Ukraine War: ప్రధాని మోదీ తాజా పాడ్కాస్ట్ నేపథ్యంలో పొలాండ్ విదేశాంగ శాఖ సహాయమంత్రి వ్లాడిస్లా టియోఫిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ గొప్ప మాట సాయం చేసిందని కొనియాడారు. ఉక్రెయిన్పై అణు వ్యూహాత్మక ఆయుధాలు ప్రయోగించకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఒప్పించి ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారని తెలిపారు. తమకు శాశ్వత శాంతి కావాలన్న టియోఫిల్, ఉక్రెయిన్లో సుస్థిరశాంతి కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ వార్సా పర్యటన తమకు ఎంతో ఉపయోగపడిందని, శాశ్వత, సుస్థిరశాంతిని తాము కోరుకుంటున్నామని ఆయన తెలిపారు.
గతేడాది ఆగస్టులో పోలాండ్లో పర్యటించిన ప్రధాని మోదీ, ఒక దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం, రాజకీయ స్వతంత్రతలకు మరో దేశం భంగం కలిగించకూడదన్నారు. అన్ని దేశాలూ అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకతను ఆ సందర్భంగా చెప్పారు. అనంతరం ఉక్రెయిన్కు వెళ్లి జెలెన్స్కీతో సమావేశమయ్యారు.
తాజాగా అమెరికాకు చెందిన కృత్రిమ మేధ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్కు ఇచ్చిన పాడ్కాస్ట్లో రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు జరిగినప్పుడే వివాదానికి పరిష్కారం లభిస్తుందని యుద్ధక్షేత్రంలో కాదని మోదీ తెలిపారు. యుద్ధక్షేత్రంలో ఎన్నటికీ పరిష్కారం దొరకదని, ఈ వ్యవహారంలో భారత్ తటస్థంగా లేదని శాంతికి దృఢంగా కట్టుబడి ఉందన్నారు. పుతిన్, జెలెన్స్కీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు.
ట్రంప్తో పుతిన్ చర్చలు- ఉక్రెయిన్, రష్యా యుద్ధం ముగుస్తుందా?
'ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలు కాపాడండి'- పుతిన్కు ట్రంప్ రిక్వెస్ట్!