Myanmar Prisoners Released : దేశ సంప్రదాయ నూతన సంవత్సరం సందర్భంగా సుమారు 4,900 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది మయన్మార్ సైనిక ప్రభుత్వం. వారిలో 22 మంది రాజకీయ ఖైదీలు ఉన్నారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. యాంగోన్లోని ఇన్సీన్ జైలు నుంచి 19 బస్సులు ఖైదీలతో బయలుదేరాయి. ఖైదీల కుటుంబ సభ్యులు జైలు వెలుపల గేటు వద్ద వేచి ఉండి తమవారికి చూసి ఆనందంతో పొంగిపోయారు. ఖైదీలను స్వాగతించారు.
మరోవైపు, మయన్మార్ సైనిక ప్రభుత్వ అధినేత జనరల్ మిన్ అంగ్ 4,893 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారని మరో స్థానిక మీడియా ఛానెల్ ప్రకటించింది. అందులో 13 మంది విదేశీయులను కూడా ఉన్నారని పేర్కొంది. వారిని దేశం నుంచి వెల్లగొడతారని కూడా వెల్లడించింది. హత్య, అత్యాచారం వంటి తీవ్రమైన ఘటనల్లో దోషులుగా తేలిన వారికి, వివిధ ఇతర భద్రతా చర్యల కింద జైలు శిక్ష పడిన వారు మినహా ఇతర ఖైదీలకు శిక్ష తగ్గించారు. క్షమాభిక్ష పొందిన ఖైదీలు మళ్లీ చట్టాన్ని ఉల్లంఘిస్తే వారికి శిక్ష పడుతుంది. మయన్మార్లో సెలవు, పర్వదినాల్లో సామూహిక క్షమాభిక్షలు పెట్టడం సాధారణమే.
కుప్పకూలిన ప్రజాప్రభుత్వం
ఆంగ్ సాన్ సూకీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని 2021లో ఆర్మీ కూల్చివేసింది. అప్పటి నుంచి మయన్మార్ సైనిక పాలనలో ఉంది. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. భారీ హింస చెలరేగింది. ఈ క్రమంలో మయన్మార్ ప్రస్తుతం అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రజలను రెచ్చగొట్టారనే ఆరోపణలపై చాలా మంది రాజకీయ నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపింది సైనిక ప్రభుత్వం. వారికి కూడా ప్రస్తుతం క్షమాభిక్ష పెట్టినట్లు తెలుస్తోంది.
ఆంగ్ సాన్ సూకీ రిలీజ్ అయ్యారా?
ఆంగ్ సాన్ సూకీతో సహా దాదాపు 22,197 మంది రాజకీయ ఖైదీలు గత శుక్రవారం నాటికి నిర్బంధంలో ఉన్నారని మయన్మార్ కు చెందిన స్వతంత్ర సంస్థ అయిన అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ తెలిపింది. తాజాగా విడుదలైనవారిలో ఆంగ్ సాన్ సూకీ ఉన్నారో లేదో తెలియరాలేదు. 2023లో అరెస్ట్ అయిన డ్వై మెట్టార్ అనే దర్శకుడు జైలు నుంచి విడుదలయ్యారు.
ఇటీవల భారీ భూకంపంతో మయన్మార్ అతలాకుతలమైంది. ముఖ్యంగా మాండలే, నేపిడాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. భూకంప ధాటికి దాదాపు 3,725 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి మయన్మార్ సైనిక ప్రభుత్వ అధినేత జనరల్ మిన్ అంగ్ ప్రసంగించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో వీలైనంత త్వరగా పునర్నిర్మాణం, పునరావాస చర్యలను తమ ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించే ప్లాన్ లో ఉన్నామని స్పష్టం చేశారు.
మయన్మార్లో 2000 దాటిన మృతుల సంఖ్య- సుమారు 4వేల మందికి తీవ్రగాయాలు!
మయన్మార్కు 15 టన్నులు సహాయ సామగ్రి- అండగా ఉంటామని మోదీ హామీ