Jihadi Attack In Burkina Faso : ఉత్తర బుర్కినా ఫాసోలో ఓ జిహాదీ గ్రూప్ మారణహోమం సృష్టించింది. దేశంలోని పలు చోట్ల ఒకేసారి జరిపిన ఈ దాడుల్లో 100 మందికి పైగా మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది సైనికులు ఉండగా, ఒక సహాయ కార్యకర్త, స్థానికులు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది.
'జిహాదీ గ్రూప్ ప్రధానంగా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది. అలాగే వ్యూహాత్మకంగా కీలక పట్టణమైన జిబోతో సహా అనేక ప్రదేశాల్లో ఆదివారం తెల్లవారు జామున ఏకకాలంలో దాడులకు పాల్పడింది' అని ఓ సహాయక కార్యకర్త (ఎయిడ్ వర్కర్) పేర్కొన్నారు. ఉగ్రదాడుల వల్ల మరణించిన వారిలో తన తండ్రి కూడా ఉన్నాడని ఓ విద్యార్థి చెప్పారు.
సహెల్ ప్రాంతంలో చురుకుగా పనిచేస్తున్న జమాత్ నస్ర్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (జేఎన్ఐఎం) అనే జిహాదీ గ్రూప్ ఈ దాడులు చేసినట్లు ప్రకటించుకుంది. దీనికి అల్-ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం.
సైనిక జుంటా పరిపాలన
బుర్కినా ఫాసోలో సైనిక జుంటా పరిపాలన కొనసాగుతోంది. ఈ దేశంలో 23 మిలియన్ల జనాభా ఉంది. ఈ భూపరివేష్టిత దేశం హింసాత్మక తీవ్రవాదానికి ప్రపంచ హాట్ స్పాట్గా ఉంది. అందుకే ఈ దేశం ఆఫ్రికాలోని సహెల్ ప్రాంతంలో అత్యంత భద్రతా సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాల్లో ఒకటిగా ఉంది.
సగం దేశంలో ఉగ్రవాదులదే హవా
2022లో జిహాదీలు హింసాత్మక తిరుగుబాట్లు చేశారు. దీనితో బుర్కినా ఫాసోలోని దాదాపు సగభాగం ప్రభుత్వ నియంత్రణలో లేకుండా పోయింది. మరోవైపు దేశ భద్రతా దళాలు కూడా చట్టవిరుద్ధమైన హత్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారంటే?
'బుర్కినా ఫాసోలోని వైమానిక దళాన్ని లక్ష్యంగా చేసుకుని జేఎన్ఐఎం తీవ్రవాదులు ఒకేసారి 8 ప్రాంతాలపై దాడులు చేశారు. ప్రధాన దాడి జిబోలో జరిగింది. పట్టణంలోని అన్ని ప్రవేశ తనిఖీ కేంద్రాలను తీవ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తరువాత సైనిక శిబిరాలపై, మరీ ముఖ్యంగా స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ యూనిట్ క్యాంప్పై దాడి చేశారు' అని ఓ ఎయిడ్ వర్కర్ తెలిపారు.
అయితే భద్రతా దళాలు ఉగ్రదాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయని వెర్బ్ అనే అతను పేర్కొన్నాడు. అయితే తాజా దాడితో బుర్కినా ఫాసోలో ఈ జిహీదీ గ్రూప్ ప్రాబల్యం మరింత పెరిగే అవకాశం ఉందని సౌఫాన్ సెంటర్ సెక్యూరిటీ థింక్ ట్యాంక్, సీనియర్ రీసెర్చ్ ఫెలో వాసిమ్ నాస్ర్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు దేశ సైనిక దళాలు పౌరులను భారీగా మిలటరీలోకి తీసుకుంటున్నాయని, కానీ వారికి సరైన శిక్షణ ఇవ్వడం లేదని, దీని వల్ల పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని నివారించా : ట్రంప్
అఫ్గానిస్థాన్లో చెస్పై బ్యాన్ విధించిన తాలిబన్లు- కారణం ఇదే!