Israel Orders To Seize Gaza Land : గాజాలోని మరింత భూభాగాన్ని ఆక్రమించాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)ను దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆదేశించారు. మరింత మంది బంధీలను విడుదల చేసేందుకు హమాస్ నిరాకరించడం వల్లనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. గాజా స్ట్రిప్లోని మరిన్ని ప్రదేశాలను ఆక్రమించాలని కాట్జ్ సైనిక దళాలను ఆదేశించారు. దీనితో పాలస్తీనా పౌరులు ఉన్న ప్రదేశాలను ఖాళీ చేయాలని ఐడీఎఫ్ బలగాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
"ఐడీఎఫ్ బలగాలు, ఇజ్రాయెల్ ప్రజలను రక్షించేందుకు గాజాలో సెక్యూరిటీ జోన్లను విస్తరించండి. బందీలను విడుదల చేసేందుకు హమాస్ జాప్యం చేసేకొద్దీ, మరింత భూమిని కోల్పోతుంటుంది. దానిని ఇజ్రాయెల్లో విలీనం చేసుకొంటుంది" అని కాట్జ్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 85 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా, 133 మందికి గాయపడ్డారు.
ఒత్తిడి పెంచాల్సిందే!
గాజాలో సైనిక చర్య కొనసాగించేందుకు కాట్జ్ గురువారం ఆమోదముద్ర వేశారు. బందీలు విడుదలయ్యే వరకూ గాజాపై సైన్యం ఒత్తిడి పెంచాలన్నారు. ఇక అక్కడి ప్రధాన ప్రదేశాల్లో నాలుగు దళాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఐడీఎఫ్ నిన్న ప్రకటించింది. కాల్పుల విరమణ తర్వాత తొలిసారి బుధవారం ట్యాంకులు, పదాతి దళాలు ఆక్రమణకు దిగాయి. నెట్జారిమ్ కారిడార్లో ఈ సైనిక చర్య జరిగింది. రెండు వైపుల నుంచి ఉత్తర, దక్షిణ గాజాలను వేరు చేసేలా ఈ ఆపరేషన్ జరిగింది.
గాజాలోని తుర్కిష్ ఆసుపత్రిని ఐడీఎఫ్ దళాలు పేల్చేశాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. గతంలో ఐడీఎఫ్ గాజాలో ప్రవేశించినప్పుడు తుర్కిష్-పాలస్తీనియన్ వైద్యశాలనే తమ ఆపరేషనల్ బేస్గా మార్చుకొన్నాయి. దీని కింద హమాస్ సొరంగాల నెట్వర్క్ ఉన్నట్లు గతేడాది ఐడీఎఫ్ ప్రకటించింది.
గాజాలో తీవ్ర ఇంధన కొరత!
గాజాలో తీవ్ర స్థాయిలో ఇంధన కొరత నెలకొన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా రెడ్ క్రిసెంట్ ఎమర్జెన్సీ వాహనాల్లో సగానికి పైగా నిరుపయోగంగా మారాయి. ఈ విషయాన్ని రెడ్క్రాస్ ధ్రువీకరించింది. ఇక్కడ మొత్తం 53 వాహనాలు ఉండగా, 23 మాత్రమే సాయానికి సంబంధించిన సరఫరాలు చేస్తున్నాయి.