Iran Port Blast Death Toll : దక్షిణ ఇరాన్లోని షాహీద్ రజాయే ఓడరేవులో సంభవించిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 46కి చేరింది. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ పరామర్శించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు.
అణ్వాయుధాలపై ఇరాన్, అమెరికాలు ఒమన్లో మూడో విడత చర్చలు జరుపుతున్న సమయంలో బందర్ అబ్బాస్ నగరంలోని షాహీద్ రజాయే ఓడరేవులో ఈనెల 26న భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన తీవ్రత భయానకంగా ఉంది. పేలుడు సంభవించిన వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నికీలలు కంటైనర్ యార్డ్ మొత్తం వ్యాపించాయి. పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం పాటు వినిపించింది. దట్టమైన పొగ పోర్ట్ మొత్తం అలుముకుంది. పలు భవనాల కిటికీలు, పోర్ట్ కు దూరంగా పార్క్ చేసి ఉంచిన వాహనాల అద్దాలు కూడా పగిలిపోయాయి.
కాగా, రజాయే పేలుడు ఘటన వెనుక విద్రోహ చర్య ఉందా అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇది దాడి కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. బాలిస్టిక్ క్షిపణుల్లో ఘనరూప ఇంధనంగా వాడే అమ్మోనియం పెర్క్లోరేట్ రాకెట్ ఫ్యూయల్ గత నెలలో షాహీద్ రజాయే ఓడరేవులో దిగుమతి అయిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇది చైనా నుంచి రెండు నౌకల్లో వచ్చిందని పేర్కొంది. పోర్టులో నిల్వ ఉన్న కొన్ని అమ్మోనియం పెర్క్లోరేట్ కంటైనర్లు పేలడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. 2020లో కూడా బీరుట్ పోర్టులో అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉన్న గోదాములో పేలుడు సంభవించడంతో 200 మంది మృతిచెందారు.
ఏటా భారీ మొత్తంలో ఎగుమతులు, దిగుమతులు
ఇదిలా ఉండగా రజాయే ఓడరేవులో ప్రధానంగా కంటెయినర్ల కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఏటా 80 మిలియన్ టన్నుల (72.5 మిలియన్ మెట్రిక్ టన్నులు) సరకు ఎగుమతి, దిగుమతి అవుతుంది. స్థానికంగా చమురు ట్యాంకులు, పెట్రో కెమికల్ సౌకర్యాలు ఉన్నాయి.