US Vs India Trade Dispute In WTO : ఉక్కు, అల్యూమినియంపై సంకాలు విధించాలనే నిర్ణయం జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా తీసుకున్నదని, దీనిని రక్షణ చర్యలు(సేఫ్గార్డ్ మెజర్స్)గా పరిగణించరాదని అగ్రరాజ్యం అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కి తెలియజేసింది.
భారత్ ఏప్రిల్ 11న అమెరికా విధించిన ప్రతీకార సుంకాలపై డబ్ల్యూటీఓకు ఫిర్యాదు చేసింది. డబ్ల్యూటీఓ సేఫ్గార్డ్స్ ఒప్పందం కింద అమెరికాతో ఈ విషయం గురించి సంప్రదింపులు జరపాలని కోరింది. ఉక్కు, అల్యూమినియంపై సుంకాల విధింపు అనేది ఒప్పందం ప్రకారం, భద్రతా చర్యల కిందకు వస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, ఈ విషయాన్ని డబ్ల్యూటీఓ కమిటీకి తెలియజేయడంలోనూ అమెరికా విఫలమైందని పేర్కొంది.
జస్ట్ జాతీయ భద్రత కోసమే!
"భారత్-అమెరికా ఒప్పందంలోని ఆర్టికల్ 12.3 ప్రకారం, సుంకాల విధింపు అనేది జాతీయ భద్రతా చర్యలు కిందకు వస్తుంది. అందుకే అమెరికా అధ్యక్షుడు సెక్షన్ 232 కింద ఉక్కు, అల్యూమినియంలపై సుంకాలు విధించారు. అంటే అమెరికా జాతీయ భద్రతను దెబ్బతీసే ప్రమాదం ఉన్న ఉక్కు, అల్యూమినియం దిగుమతులను తగ్గించడానికి లేదా సర్దుబాటు చేయడానికి సుంకాలు అవసరమని ఆయన నిర్ణయించారు" అని అమెరికా ఏప్రిల్ 17న డబ్ల్యూటీఓకు వివరణ ఇచ్చింది.
'సెక్షన్ 232 ఒక జాతీయ భద్రతా చట్టం అని, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ (GATT) 1994లోని నిబంధనల ప్రకారం, అనుమతించబడిన భద్రతా మినహాయింపు కింద సుంకాలు విధించామని' అమెరికా తెలిపింది. అంతేకాదు 1974 వాణిజ్య చట్టంలోని నిబంధన ప్రకారం సుంకాలు విధించలేదని, ఇది యూఎస్ సేఫ్టీ కోసం రక్షణ చర్యలు తీసుకునే వెసులుకల్పించే చట్టం అని పేర్కొంది.
'అమెరికా రక్షణ లేదా అత్యవసర చర్య నిబంధనల ప్రకారం, సుంకాలు విధించలేదు. కనుక ఇవి రక్షణ చర్యలు కావు. కేవలం జాతీయ భద్రత కారణాల దృష్ట్యానే భారత ఉత్పత్తులపై సుంకాలు విధించాం. కనుక ఈ విషయంలో భారత్లో మరలా సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ భారత్తోనూ, లేదా మరే ఇతర దేశాలతోనూ ఈ అంశంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నాం' అని అమెరికా తెలిపింది.
భారత్పై సుంకాల మోత
అమెరికా 2018 మార్చి 8న భారత ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై వరుసగా 25 శాతం, 10 శాతం యాడ్ వాలోరెమ్ సుంకాలు విధించింది. ఇవి 2018 మార్చి 23 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ విధంగా అమెరికా తన రక్షణ చర్యలు తీసుకుంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 10న అమెరికా మళ్లీ భారత్కు చెందిన ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అదనపు సుంకాలు విధించింది. ఇవి 2025 మార్చి 12 నుంచి అపరిమిత కాల వ్యవధితో అమల్లోకి వచ్చాయి.
'ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్- ప్రపంచ వాణిజ్యం ఎంత శాతం తగ్గుతుందంటే!