India China Flight Services : భారత్, చైనా మధ్య ఐదేళ్ల తర్వాత నేరుగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు చైనా కాన్సుల్ జనరల్ జు వీ తెలిపారు. ఈ విషయంపై భారత అధికారులతో చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు.
'కృషి చేస్తున్నాం'
కొవిడ్, గల్వాన్ సంఘర్షణల నేపథ్యంలో భారత్, చైనా మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు జనరల్ జు వీ వెల్లడించారు. ఈ మేరకు కోల్కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కొవిడ్కు ముందు బీజింగ్, షాంఘై, గ్వాంగ్జౌ, కున్మింగ్ నుంచి భారత్లోని దిల్లీ, ముంబయి, కోల్కతా, ఇతర నగరాలకు వారానికి 50 విమాన సర్వీసులుండేవని ఆయన చెప్పారు. ఆ సేవలను తిరిగి పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
భారత్తో కలిసి వేడుకలను జరుపుకోవడానికి రెడీ!
విమాన సర్వీసుల పునరుద్ధరణ తర్వాత వీసా నిబంధనల్లో కూడా సడలింపులు చేసే అవకాశం ఉన్నట్లు చైనా కాన్సుల్ జనరల్ జు వీ పేర్కొన్నారు. భారత్, చైనా మధ్య దౌత్య సంబంధాలకు మరో వారంలో 75 ఏళ్లు పూర్తవుతుండడం వల్ల ఏప్రిల్ 1న ఇరుదేశాలు సంయుక్తంగా కొన్ని వేడుకలను జరుపుకోనున్నట్లు జు వీ వెల్లడించారు. భారత్తో కలిసి వేడుకలను జరుపుకోవడానికి, దౌత్య సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడానికి ఉత్సాహంగా ఉన్నామని ఆయన అన్నారు.
జనవరిలో భారత్ విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ చైనాను సందర్శించిన తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మొదట ఈ ప్రకటన విడుదల చేసింది. ఇరుదేశాల మధ్య విమాన సేవలను తిరిగి ప్రారంభించడానికి సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు తెలిపింది. కొవిడ్ 19 మొదలైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే, ఇటీవల లద్దాఖ్ సరిహద్దులో బలగాల ఉపసంహరణ, గస్తీ పునఃప్రారంభం విషయంలో రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా విమాన సర్వీసుల అంశం చర్చకు వచ్చినట్లు పేర్కొంది.