China Pahalgam Attack Investigation: చైనా మరోసారి తన వక్రబద్ధిని ప్రదర్శించింది. ఓ వైపు ప్రపంచ దేశాలు బాధిత దేశమైన భారత్కు మద్దతుగా నిలుస్తుంటే, చైనా మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కుట్రదారు పాక్కు వత్తాసు పలుకుతోంది. తాజాగా తమ మిత్రరాజ్యమైన పాకిస్థాన్ సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలను కాపాడేందుకు తాము అండగా ఉంటామని ప్రకటించి తన వక్రబుద్ధిని మరోసారి బహిరంగపర్చుకుంది.
అలాగే పహల్గాం ఉగ్రదాడిపై 'త్వరగా, న్యాయమైన దర్యాప్తు' చేయాలని చైనా వ్యాఖ్యానించింది. 'చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆదివారం పాకిస్థాన్ ఉపప్రధాని, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్బంగా పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాక్ల మధ్య పెరిగిన ఉద్రిక్తతల గురించి వాంగ్ యికు ఇషాక్ దార్ వివరించినట్లు' చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.
పాక్కు మద్దతుగా నిలుస్తాం: చైనా
భారత్, పాక్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను, జరుగుతున్న పరిణామాలను చైనా నిశితంగా గమనిస్తోందని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ప్రపంచ దేశాల ఉమ్మడి బాధ్యత అని వాంగ్ పేర్కొన్నారు. కానీ వెంటనే చైనా వక్రబుద్ధిని స్పష్టంగా బయటపెట్టారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంపూర్ణ చైనా మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు.
"చైనా మిత్రదేశం, వ్యూహాత్మక సహకార భాగస్వామి అయిన పాకిస్థాన్ భద్రతా ఆందోళనలను మేము పూర్తిగా అర్థం చేసుకున్నాం. పాక్ తన సార్వభౌమాధికారాన్ని, భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడానికి మా పూర్తి మద్దతు ఇస్తాం. పహల్గాం ఉగ్రదాడి విషయంలో త్వరగా, న్యాయమైన దర్యాప్తు చేయాలని మేము కోరుతున్నాం. ఈ వివాదం భారత్, పాక్ల ప్రాథమిక ప్రయోజనాలకు ఏమాత్రం ఉపయోగపడదు. అంతేకాదు ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి కూడా ఎలాంటి ప్రయోజనం చేకూరదు. కనుక ఇరుదేశాలు సంయమనం పాటించాలి. ఇరు పక్షాలు ఈ ఉద్రిక్తతలు తగ్గించడానికి పరస్పరం ముందుకు రావాలి."
- వాంగ్ యి, చైనా విదేశాంగ మంత్రి
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ పోరాడుతోందట!
మరోవైపు 'పాకిస్థాన్ నిరంతరం, చాలా దృఢంగా ఉగ్రవాదంపై పోరాడుతోందని, దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడానికి దారితీసే ఏ చర్యలకైనా తాము వ్యతిరేకం' అని ఇషాక్ దార్ చెప్పినట్లు జిన్హువా పేర్కొంది. అంతేకాదు 'పాకిస్థాన్ చాలా పరిణితితో పరిస్థితిని చక్కబెట్టడానికి కట్టుబడి ఉందని, చైనా సహా అంతర్జాతీయ సమాజంతో ఉత్తర,ప్రత్యుత్తరాలు కొనసాగిస్తుందని' దార్ చెప్పినట్లు వెల్లడించింది.
అప్పుడో మాట, ఇప్పుడో మాట!
ఏప్రిల్ 23న జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లోకి చొరబడి ఉగ్రవాదులు 26 మందిని చంపేశారు. హిందూ పర్యాటకులే లక్ష్యంగా ఈ ఉగ్రదాడి జరిగింది. దీనితో ఈ క్రూరమైన దాడిని చైనా తీవ్రంగా ఖండించింది.
"పహల్గాం దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చైనా అన్ని రకాల ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రాణాలు కోల్పోయిన వారికి మేము సంతాపం తెలియజేస్తున్నాం. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాం" అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ అన్నారు.
భారతదేశంలోని చైనా రాయబారి జు ఫీహాంగ్ కూడా ఈ ఉగ్రదాడిని ఖండించారు. "పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. దాడిని మేము ఖండిస్తున్నాం. బాధితులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నాం" అని జు ఫీహాంగ్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. కానీ ఇప్పుడు చైనా విదేశాంగ మంత్రి పాక్కు మద్దతుగా మాట్లాడడం గమనార్హం.
పహల్గాం ఉగ్రదాడిపై అంతర్జాతీయ దర్యాప్తు- రష్యా, చైనాల జోక్యం కోరుకుంటున్న పాక్!
రష్యాకు మా సైనికులను పంపించాం: తొలిసారిగా అంగీకరించిన ఉత్తర కొరియా