Canada Elections Results 2025 : కెనడా సమాఖ్య ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం దాదాపు ఖరారైనట్లే. 343 స్థానాలున్న హౌజ్ ఆఫ్ కామన్స్లో గెలుపు కోసం 172సీట్లు అవసరమవగా లిబరల్ పార్టీ అధికారంలోకి రావడానికి అవరమైన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. లిబరల్ పార్టీ కెనడా ఎన్నికల్లో గెలవడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ పార్టీ నాయకుడైన మార్క్ కార్నీ ప్రధానిగా కొనసాగుతున్నారు. గెలుపు దాదాపు ఖాయమైన నేపథ్యంలో కొత్త మంత్రివర్గంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంపై ఆయన ఫోకస్ పెట్టారు. కెనడా ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి, కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనం చేసుకుంటామన్న బెదిరింపులు లిబరల్ పార్టీ ఓటమికి కారణం అవుతాయని అందరూ భావించారు. అయితే అమెరికా బెదిరింపులతో కెనెడియన్లలో జాతీయ ఐక్యత పెరిగి లిబరల్ పార్టీకే పట్టం గట్టడంతో వరుసగా నాలుగోసారి ఆ పార్టీ అధికారం చేపట్టనుంది.
ట్రంప్పై కార్నీ ఫైర్
మరోవైపు పార్టీ విజయోత్సవ సభలో ప్రసంగించిన ప్రధాని మార్క్ కార్నీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలపై మండిపడ్డారు. అమెరికా చేసిన ద్రోహం నుంచి కెనడా బయటపడిందనీ ఐతే ఈ పాఠాలను ఎప్పటికీ మర్చిపోకూడదని వ్యాఖ్యానించారు. తమ భూమి, ఖనిజ వనరులు, నీటిని, దేశాన్ని అమెరికా కోరుకుంటోందని కార్నీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పనికిరాని బెదిరింపులతో ట్రంప్ కెనడాను విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తున్నారన్న ప్రధాని, అది ఎప్పటికీ జరగదని స్పష్టంచేశారు. దేశాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో అమెరికా సుంకాలు, విలీనానికి సంబంధించిన బెదిరింపులకు పాల్పడుతుంది ఆరోపించారు. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కెనడియన్లు ఐక్యంగా ఉండాలని ప్రధాని కార్నీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లో కొన్ని నెలలు ఇబ్బందిగా ఉండొచ్చని, అయినప్పటికీ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు. కెనడా గతంలో కంటే బలంగా పుంజుకుంటుందని చెప్పారు. ఎన్నికల్లో తమకు గట్టి పోటీ ఇచ్చినందుకు ప్రతిపక్ష నాయకుడు పోయిలివ్రేను కార్నీ అభినందించిన ఆయన, దేశ అభివృద్ధి విషయంలో తామందరం ఒకేలా ఆలోచిస్తామని పేర్కొన్నారు.
కార్నీకి ప్రధాని మోదీ అభినందనలు
కెనడా ప్రధానమంత్రిగా ఎన్నికైన మార్క్ కార్నీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. భారత్, కెనడా ప్రజాస్వామ్య విలువలు, చట్ట పాలన పట్ల కట్టుబడి ఉన్నాయని అన్నారు. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
అమెరికా ద్రోహాన్ని ఎప్పటకీ మర్చిపోవద్దు : కెనడా ప్రధాని
త్వరలోనే భారత్ ప్రతీకార దాడి- అత్యంత అప్రమత్తంగా ఉన్నాం : పాకిస్థాన్