Indus Water Treaty Effect On Pakistan : పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్కు బుద్ధి చెప్పేందుకు సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం వల్ల దాయాది దేశానికి నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. పాకిస్థాన్లోని పలు డ్యామ్లలో నీటి మట్టం దారుణంగా పడిపోయింది. దాదాపు డెడ్లెవల్కు చేరిందని పాక్ అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే సింధు బేసిన్లో నీటి ప్రవాహం 15 శాతం తగ్గింది. వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన పాకిస్థాన్ రైతులకు నీరు లేకపోవడం వల్ల ఖరీఫ్ సీజన్లో మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో గతేడాది జూన్ 5న 1.44 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల ఉండగా, ప్రస్తుతం నీటి విడుదల 1.24 లక్షల క్యూసెక్కులకు తగ్గిందని తెలిపింది. తాజా డేటా ప్రకారం పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని టార్బెలా ఆనకట్ట వద్ద సింధూ నది నీటి మట్టం 1,465 మీటర్లకు తగ్గినట్టు ఉంది. ఈ డ్యామ్లో డెడ్ లెవల్ 1,402 మీటర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. పంజాబ్లోని చస్మా ఆనకట్ట వద్ద ప్రస్తుతం నీటి మట్టం 644 మీటర్లుగా ఉంది. ఇక్కడ డెడ్ లెవల్ 638 మీటర్లని సమాచారం. మీర్పూర్లోని జీలంపై ఉన్న మంగ్లా ఆనకట్ట వద్ద 1,163 మీటర్ల స్థాయిలో నీరు ఉంది. ఇక్కడ డెడ్ లెవల్ 1,050 మీటర్లుగా తెలుస్తోంది. సియాల్కోట్లో మరాలా వద్ద పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని సమాచారం. అక్కడ చీనాబ్పై సగటు నీటి విడుదల మే 28న 26,645 క్యూసెక్కుల నుంచి జూన్ 5న 3,064 క్యూసెక్కులకు పడిపోయిందని పాకిస్తాన్ డేటా ద్వారా స్పష్టమవుతోంది.
ప్రమాదంలో ఖరీఫ్ సీజన్ పంటలు
పాక్లోని పంజాబ్లో ఖరీఫ్ సీజన్ పంటలు ప్రమాదంలో ఉన్నట్టు దాయాదికి చెందిన ఓ అధికారి పేర్కొన్నట్టు జాతీయ మీడియా తెలిపింది. ఖరీఫ్కు ముందే భారత్ నిర్ణయంతో 21 శాతం నీటి కొరత ఏర్పడుతుందని పాక్ అంచనా వేసినట్టు ఆయన పేర్కొన్నారని చెప్పింది. ఇప్పటికే వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన పాకిస్థాన్కు నీరు లేకపోవడం వల్ల ఈ సీజన్లో మరిన్ని కష్టాలు తప్పవని డేటా విశ్లేషణ తర్వాత జాతీయ మీడియా అంచనా వేసింది.
మరోవైపు ఆదివారం నుంచి పాక్లో తీవ్రమైన వేడి గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎగువ పంజాబ్, ఇస్లామాబాద్, ఖైబర్ పఖ్తుంఖ్వా, కశ్మీర్, గిల్గిట్-బాల్టిస్తాన్లలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటాయని సమాచారం. సింధూ జలాల ఒప్పందం నిలిపివేసిన తర్వాత భారత్కు లేఖల ద్వారా పాక్ విజ్ఞప్తి చేసేందుకు యత్నించినట్టు జాతీయ మీడియా తెలిపింది. మరోసారి ఈ నిర్ణయంపై యోచించాలని పేర్కొన్నట్టు తెలిపింది. పాక్ తీరు మారే వరకూ ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.
"మమ్మల్ని నిందించొద్దు- పాకిస్తానే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది"- ఐరాస సదస్సులో భారత్
సింధూ జలాలు ఆపితే భారత ప్రజల ఊపిరి ఆపేస్తాం- ఉగ్రవాదుల రాగం అందుకున్న పాక్ ఆర్మీ