Pavan Kalyan Son Fire Accident : సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలయ్యాయి. మంగళవారం పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యయి. దీంతో అల్లూరి జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లనున్నారు. ఊపిరితిత్తుల్లోకి పొగ దూరడంతో మార్క్ శంకర్ అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ప్రస్తుతం సింగపూర్లోని ఓ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్కు చికిత్స అందిస్తున్నారు.
అగ్ని ప్రమాదం జరిగిన స్కూల్ ఇదే
సింగపూర్లోని రివర్ వ్యాలీ షాప్హౌస్లో మంగళవారం ఉదయం 9.45 గంటలకు ఈ ఘటన జరిగింది. అయితే, ఈ భవనంలో చిన్నారులకు క్యాంప్ నిర్వహిస్తున్నారు. రెండు, మూడు అంతస్తుల్లో మంటలు చెలరేగగా, సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. భవనం లోపల చిక్కుకున్న వారిని కాపాడి రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. కాగా, ఈ అగ్ని ప్రమాదంలో 15 మంది చిన్నారులు సహా 19 మంది గాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
అయితే, ప్రస్తుతం అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ను పర్యటన నిలిపివేసి వెంటనే సింగపూర్ వెళ్లాలని నేతలు సూచించారు. కానీ, ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తానని పవన్ కల్యాణ్ వారికి తెలిపారు. ముందుగా అరకులోని కురిడి గ్రామ సమస్యలు తెలుసుకుంటానని, అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున పూర్తి చేసి వెళ్తానని పవన్ వివరించారు. దీంతో మన్యం పర్యటన ముగిశాక పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.