Railway Jobs 2025 : ఐటీఐ చేసి రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 1007 యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు 2025-26 సంవత్సరానికిగాను నాగ్పుర్ డివిజన్, మోతిబాగ్ వర్క్షాప్ (నాగ్పుర్)లో అప్రెంటిస్షిప్ శిక్షణ ఇస్తారు. పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మే 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రిక్రూట్మెంట్ వివరాలు
- యాక్ట్ అప్రెంటిస్: 1007 పోస్టులు
- ట్రేడులు : ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్, పీఓపీఏ
- విద్యార్హతలు : అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
- వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 2025 ఏప్రిల్ 5 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు; ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు, ఎక్స్-సర్వీస్మెన్కు 10 ఏళ్లపాటు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
- ఎంపిక ప్రక్రియ : మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను వడపోస్తారు. తరువాత మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, యాక్ట్ అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
- స్టైపెండ్ : ఈ యాక్ట్ అప్రెంటీస్లకు నెలకు రూ.7,700 - రూ.8,050 స్టైపెండ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం
- ముందుగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకు చెందిన అధికారిక వెబ్సైట్ https://secr.indianrailways.gov.in/ ఓపెన్ చేయాలి.
- రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్లి అప్రెంటీస్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ లింక్పై క్లిక్ చేయాలి.
- మీ ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లను ఎంటర్ చేసి పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి.
- తరువాత అప్లికేషన్ ఫారమ్లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- తరువాత మీ విద్యార్హతలకు సంబంధించిన, అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను తీసుకోవాలి.
దరఖాస్తు తేదీలు :
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2025 ఏప్రిల్ 5
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2025 మే 4