Study and Work in Australia : తెలుగు రాష్ట్ర విద్యార్థులు ఎక్కువ మంది అమెరికాలో ఉన్నత చదువులు చదవడానికి, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ప్రస్తుతం అమెరికాలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు అక్కడి చదువుల విషయంలో గందరగోళానికి గురవుతున్నారు. ఈ తరుణంలో ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఓ శుభవార్త చెప్పంది. అదే భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆస్ట్రేలియా రావాలని అక్కడి సౌత్ ఆస్ట్రేలియా ప్రీమియర్, ఎంపీ పీటర్ మలినౌస్కస్ కోరుతున్నారు.
ఆస్ట్రేలియాలో కూడా ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అమెరికాలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు తమ దేశాన్ని ఎంపిక చేసుకోవాలని కోరారు. విద్యార్థి వీసాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, పరిశోధన రంగాల్లోనూ భారతీయ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని గుర్తు చేశారు. ఆస్ట్రేలియాలో ఉన్న విద్యావకాశాలు, ఆర్థికాభివృద్ధి అంశాలను వివరించేందుకు దిల్లీ, ముంబయి, హైదరాబాద్లలో ఆయన ఇటీవల ఈనాడు-ఈటీవీ భారత్తో మాట్లాడారు.
ఆస్ట్రేలియాకు ఎక్కువగా దక్షిణాది విద్యార్థులే : భారతీయ విద్యార్థుల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు ఇటీవల ఎక్కువగా ఆస్ట్రేలియాలో చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. ఇంజినీరింగ్, సైన్స్, ఆర్ట్స్ విభాగాల్లో నైపుణ్యాలు నేర్పేలా విశ్వవిద్యాలయాల్లో బోధన జరుగుతుందన్నారు. తమ దేశంలో విద్య, ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అక్కడ చదువు పూర్తైన వెంటనే విద్యార్థులు పరిశోధన విద్య లేదా ఉపాధి అవకాశాలు పొందేందుకు వీలుగా రెండున్నరేళ్ల పాటు పోస్ట్ స్టడీ వర్క్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని పీటర్ మలినౌస్కస్ పలు వివరాలు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నతవిద్య, ఉపాధి అవకాశాలు కోసం వేలమంది విద్యార్థులు అమెరికాకు వెళ్తున్నారు. వారిలో చాలామంది ఆస్ట్రేలియాలో చదువుకునేలా రెండంచెల ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందులో ముఖ్యంగా విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు పెంచడం, ఫ్లిండర్స్, ఆడిలైట్ వంటి వర్సిటీలు ఇక్కడి విశ్వవిద్యాలయాలతో విద్యాబోధన, పరిశోధనలపై ఒప్పందాలు కుదుర్చుకోవడం ఇందులో భాగం.
హెచ్సీయూతో ఒప్పందం : ఈ మధ్య హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంతో కొద్దిరోజుల క్రితం హెల్త్కేర్ మేనేజ్మెంట్, డిజిటల్ హెల్త్, బిజినెస్ ఎడ్యుకేషన్ విభాగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. వారితో కలిసి సంయుక్త పరిశోధన నిర్వహించనున్నామన్నారు. ఐటీ, ఏఐ, ఇంజినీరింగ్ విభాగాల్లో ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశాలు కల్పించనున్నామని వివరించారు. పోస్ట్ స్టడీవర్క్ సదుపాయాన్ని బ్రిస్బేన్, సిడ్నీ, మెల్బోర్న్లలోని విశ్వవిద్యాలయాల్లో చదువు పూర్తి చేసినవారు ఉపయోగించుకునేందుకు వీలుందని ఆయన వివరాలు వెల్లడించారు.
వారానికి 24 పని గంటలకు అవకాశం : విదేశీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు మెరిట్ ఆధారిత ఉపకార వేతనాలను ఇవ్వనున్నాం. సెలవు రోజులు మినహాయించి వారానికి 24 గంటల పాటు పని చేసేందుకు అవకాశాలు కల్పిస్తాం. ఎంప్లాయిమెంట్ కనెక్ట్ పేరుతో వారిపేర్లను వేర్వేరు సంస్థలకు ఇస్తాం. అంతేకాదు స్థానిక వ్యాపార సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు ఈవెంట్స్ను నిర్వహిస్తాం. వీటిద్వారా విదేశీ విద్యార్థుల మా దేశంలోని నిబంధనల ప్రకారం సులువుగా ఉద్యోగాలు సంపాదించవచ్చు. సాఫ్ట్వేర్ రంగాల్లోనే కాకుండా సైన్స్, ఆర్ట్స్, ఎకనమిక్స్, హ్యూమన్ సైన్స్, హెల్త్ సైన్స్ కోర్సుల్లోనూ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నామని ఎంపీ పీటర్ మలినౌస్కస్ తెలిపారు.
అమెరికా చదువులు - ఇంకొన్ని రోజులు ఆగి చూద్దాం!
విదేశీ విద్య కోసం బ్యాంక్ లోన్ తీసుకోవాలా? బెస్ట్ రీపేమెంట్ ప్లాన్ ఇదే!