Focus on Students in Results Time : గత ఏడాది ఓ విద్యార్థిని (17) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో గణితం సబ్జెక్టులో ఫెయిల్ అయింది. మనస్తాపానికి గురైన విద్యార్థిన ఉరేసుకొని మృతి చెందారు. కుమార్తె ఫెయిల్ అయిందని తెలిసి ఫర్వాలేదని ధైర్యం చెప్పినా ఆమె ఇలా చేస్తుందనుకోలేదని పేరెంట్స్ రోదించిన తీరు కలిచివేసింది. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు.
విద్యార్థుల ఆత్మహత్యలు సామాజిక సమస్యగా మారాయి. ఒత్తిళ్లతో కూడిన చదువులు, పోటీ పరీక్షల వాతావరణానికి తోడు సామాజిక, ఆర్థిక అంశాలు విద్యార్థుల్లో మానసిక ఆందోళనకు కారణం అవుతున్నాయి. అంచనాలను అందుకోలేక, ఒత్తిళ్లను తట్టుకోలేక కుంగుబాటుకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వివిధ రకాల పరీక్షల ఫలితాలు విడుదల కానున్న సందర్భంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
వీరి విజయాలే నిదర్శనం : స్టూడెంట్ దశలో పరీక్షల్లో ఫెయిల్ అవటం అనేది జీవితంలో విజయానికి అడ్డంకి కాదని చాలా మంది నిరూపించారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో తొలుత ఫెయిల్ అయిననప్పటికీ తదనంతరం కఠోర శ్రమతో యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఐపీఎస్ అధికారిగా ఎంపికైన 'మనోజ్ కుమార్ శర్మ' జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన జీవిత కథ ఆధారంగానే '12వ తరగతి ఫెయిల్' అనే మూవీ తీశారు. ఇది ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచింది. క్రీడాకారుడిగా 'భారతరత్న' సాధించిన సచిన్ తెందూల్కర్ పదో తరగతి ఫెయిల్ అయ్యారు. మనలోని ప్రతిభకు పరీక్షల్లో వచ్చిన మార్కులు కొలమానం కాదనేదానికి సచిన్ తెందూల్కర్ జీవితమే నిదర్శనం. స్టీవ్జాబ్స్, థామస్ అల్వా ఎడిసన్, బిల్గేట్స్ వంటి ప్రముఖులు తమ వైఫల్యాలను సవాళ్లుగా స్వీకరించి స్వీయవిశ్వాసం, కఠోర శ్రమ, సృజనాత్మకతతో అసాధారణ విజయాలు సాధించారు.
ఇలా చేస్తే మేలు : విద్యావ్యవస్థలో పోటీతత్వాన్ని తగ్గించి 'స్కిల్ బేస్డ్ లెర్నింగ్'పై దృష్టి సారించాలి. విద్యాలయాల్లో మానసిక ఆరోగ్య నిపుణులు ఉండాలి. పేరెంట్స్, ఉపాధ్యాయులు, స్థానిక నేతలు విద్యార్థులకు మద్దతుగా నిలిచే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. పేరెంట్స్ తమ పిల్లలపై ఒత్తిడిని తగ్గించాలి. పరీక్షల్లో ఫెయిలైనా విద్యార్థులకు మానసిక ధైర్యం కల్పించేందుకు 'స్కూల్ వెల్నెస్' బృందాలు ఏర్పాటు చేయాలి.
స్టూడెంట్ ఆత్మహత్యలకు ముఖ్య కారణాలు :-
- పేరెంట్స్, ఉపాధ్యాయుల ఎక్కువ అంచనాలు.
- పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే ఒత్తిడి, ఆందోళన.
- పరీక్షల్లో విఫలం అవటంతో భవిష్యత్తు లక్ష్యాలు చేరుకోలేమనే అలోచన.
- కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవటం.
విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువ : నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2022లో దేశంలో 13,000 పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ సంవత్సరం జరిగిన మొత్తం బలవన్మరణాల్లో విద్యార్థుల వాటా 7.60 శాతం. అదే సంవత్సరం 11,290 మంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరితో పోల్చితే స్టూడెంట్ సంఖ్య అధికం.
"పరీక్షలు సరిగ్గా రాయలేదని తెలిపిన పిల్లల మానసిక స్థితిపై పేరెంట్స్ ఓ కన్నేసి ఉంచాలి. పరీక్షల ఫలితాల టైంలో వారిని వెన్నుతట్టి ప్రోత్సహించాలి. ఫెయిల్ అయితే సప్లిమెంటరీ పరీక్షల రూపంలో మరో అవకాశం ఉంటుందని ధైర్యం చెప్పాలి. ప్రతిభకు మార్కులు కొలమానం కాదని, పరీక్షలే సర్వస్వం అనుకోవద్దనే విషయాన్ని అర్థం అయ్యేలా వారికి తెలియజేయాలి."- జువ్వాది వెంకటేశ్వర బాబు, మానసిక వైద్య నిపుణుడు
తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ డేట్ వచ్చేసింది - ఎప్పుడంటే?
సెలవులను ఇలా ఉపయోగించుకుంటే - మీ భవిష్యత్తు బంగారమే!
బిగ్ న్యూస్ - ఇక నుంచి ఆ ఇంటర్ కోర్సు, భాషా సబ్జెక్టుల్లో ఇంటర్నల్ మార్కులు!