CDSE Notification: యూపీఎస్సీ ఏడాదికి రెండు సార్లు నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) అవివాహిత పట్టభద్రులకు మేటి అవకాశం. నిబద్ధతతో కృషి చేస్తే కొద్ది ప్రయత్నాల్లోనే విజయాన్ని అందుకోవచ్చు. గత ఫలితాల ప్రకారం పరీక్ష, ఇంటర్వ్యూలలో 45 శాతం మార్కులు పొందినవారు తప్పనిసరిగా ఏదో ఒక సర్వీసుకు ఎంపికవుతున్నారు.
ప్రతి పేపర్లో కనీసం 20 మార్కులు రావాలి: పేపర్కు వంద మార్కులు చొప్పున ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ విభాగాల్లో ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఒక్కో పేపర్ వ్యవధి 2 గంటలు. మ్యాథ్స్లో వంద, మిగిలిన రెండు పేపర్లలోనూ 120 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. సమాధానం తప్పైతే ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో మూడో వంతు తగ్గిస్తారు. పరీక్షలో అర్హతకు ప్రతి పేపర్లోనూ కనీస మార్కులు (20 లేదా 25 శాతం) పొందాలి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ) పోస్టులకే దరఖాస్తు చేసుకున్నవారు మ్యాథ్స్ పేపర్ రాయనవసరం లేదు. అర్హత మార్కులు పొంది మెరిట్లో ఉన్నవారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
ఇంటర్వ్యూలో రెండు దశలు: పరీక్షతో సమానంగా ఈ విభాగానికీ 300 మార్కులున్నాయి. ఓటీఏ పోస్టులకే దరఖాస్తు చేసుకున్నవారికి ఇది 200 మార్కులకు ఉంటుంది. ఐదు రోజులపాటు కొనసాగే ముఖాముఖిలో రెండు దశలు. మొదటి దశలో అర్హత సాధిస్తేనే రెండో అంకానికి అనుమతిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల మెరిట్ ప్రాతిపదికన శిక్షణలోకి తీసుకుంటారు.
రూ.56,100 స్టైపెండ్: ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (ఓటీఏ) వీటిలో ఏ విభాగంలో చేరినప్పటికీ శిక్షణ వ్యవధిలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. మిలటరీ అకాడెమీకి ఎంపికైనవాళ్లకు ఇండియన్ మిలటరీ అకాడెమీ దేహ్రాదూన్లో 18 నెలల శిక్షణ ఉంటుంది. నేవల్ అకాడెమీలో చేరినవాళ్లకు సుమారు 18 నెలల పాటు కేరళలోని ఎజిమాలలో శిక్షణ నిర్వహిస్తారు. ఎయిర్ ఫోర్స్ అకాడెమీకి ఎంపికైనవారికి 18 నెలల పాటు పైలట్ శిక్షణ బీదర్, ఎలహంక, హాకీంపేటల్లో ఉంటుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు ఎంపికైనవారు చెన్నైలో 11 నెలలు శిక్షణలో పాల్గొంటారు.
మొదటి నెల నుంచే రూ.లక్ష : శిక్షణ పూర్తిచేసుకున్నవారికి ఆర్మీ, ఓటీఏలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభమవుతుంది. పేర్లలో తేడా ఉన్నప్పటికీ ఈ మూడూ సమాన హోదా (లెవెల్ 10) ఉద్యోగాలే. వీరికి రూ.56,100 మూలవేతనం లభిస్తుంది. మిలిటరీ సర్వీస్ పే కింద అదనంగా రూ.15,500 చెల్లిస్తారు. పైలట్లకు రూ.25 వేలు ఫ్లయింగ్ అలవెన్సు అందుతుంది. డీఏ, హెచ్ఆర్ఏ, ప్రోత్సాహకాలతో మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. భవిష్యత్తులో సంబంధిత విభాగాలకు అత్యున్నతాధికారి, త్రివిధ దళాలకు అధిపతీ కావచ్చు.
అదనపు సమయం :
మ్యాథ్స్: 8, 9, 10 తరగతుల గణితం పాఠ్య పుస్తకాలు బాగా చదవాలి. ఆర్ట్స్ విద్యార్థులు ఈ విభాగంలో మెరుగైన మార్కుల కోసం అదనంగా సమయం కేటాయించాలి. ప్రాథమికాంశాలు అధ్యయనం చేసి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే మ్యాథ్స్వాళ్లతో సమానంగా పోటీపడవచ్చు.
జనరల్ నాలెడ్జ్: భారతదేశ చరిత్ర, భౌగోళిక వ్యవస్థ, జాగ్రఫీ, పాలిటీ సబ్జెక్టులకు ఎన్సీఈఆర్టీ 8, 9, 10 తరగతుల పుస్తకాలు ఉపయోగపడతాయి. లూసెంట్ లేదా అరిహంత్ జీకే పుస్తకాల్లో ఏదైనా చదివితే సరిపోతుంది. సైన్స్ విభాగంలోని ప్రశ్నలకు ఎన్సీఈఆర్టీ 6-10 తరగతుల పుస్తకాల్లోని ముఖ్యాంశాలు శ్రద్ధగా చదవాలి.
ఇంగ్లిష్: ప్రశ్నలన్నీ హైస్కూల్ ఆంగ్ల పాఠ్యపుస్తకాల స్థాయిలోనే ఉంటాయి. అందువల్ల 8,9,10 తరగతుల పుస్తకాల్లోని వ్యాకరణాంశాలపై దృష్టి సారించాలి. అనంతరం వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి.
పేపర్లవారీ సిలబస్ వివరాలు ప్రకటించారు. వాటిని పరిశీలించి, ఆ అంశాలనే బాగా చదవాలి.
ప్రాథమిక స్థాయి సన్నద్ధత పూర్తయిన తర్వాత పాత ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి వీటిని పొందవచ్చు. వీటి ద్వారా.. విభాగాలవారీ ప్రశ్నలు ఏ తరహాలో వస్తున్నాయి, చదవాల్సిన అంశాలు, సన్నద్ధత ఎలా ఉండాలో అర్థమవుతుంది.
రుణాత్మక మార్కులున్నాయి కాబట్టి, తెలియని ప్రశ్నలు వదిలేయాలి. ఎక్కువ సమయం అవసరమయ్యే ప్రశ్నల దగ్గర ఆగిపోకుండా.. పరీక్ష చివరలో, సమయం మిగిలితేనే ప్రయత్నించాలి.
నేర్చుకున్న అంశాలన్నీ పరీక్షకు పది రోజుల ముందునుంచీ పునశ్చరణ చేసుకోవాలి.
పరీక్షకు నెల ముందు నుంచి వీలైనన్ని నమూనా ప్రశ్నపత్రాలు సాధన చేయాలి. వీటిని మూల్యాంకనం చేసి, ఫలితాలు విశ్లేషించాలి. ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఏ అంశాల్లో వెనుకబడ్డారో గమనించి, వాటికి అధిక ప్రాధాన్యమివ్వాలి. తర్వాత పరీక్షల్లో గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి.
అర్ఙత ఎలా అంటే:
2024(2): రాత పరీక్షలో 300కు గానూ ఐఎంఏ 117, ఐఎన్ఏ 90, ఏఎఫ్ఏ 126, ఓటీఏ 81 మార్కులు పొందినవారు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. తుది ఎంపికలో (పరీక్ష+ ఇంటర్వ్యూ) 600కు ఐఎంఏ 241, ఐఎన్ఏ 220, ఏఎఫ్ఏ 248, ఓటీఏ మెన్ 161 ఓటీఏ విమెన్ 166 మార్కుల వరకు అవకాశం లభించింది.
ఖాళీలు: 453. విభాగాల వారీ.. ఐఎంఏ-100, ఐఎన్ఏ-26, ఏఎఫ్ఏ-32, ఓటీఏ మెన్ -276, ఓటీఏ విమెన్ -19.
విద్యార్హత: మిలటరీ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ చాలు. నేవల్ అకాడెమీ ఉద్యోగాలకు బీఈ/బీటెక్ అవసరం. ఎయిర్ ఫోర్స్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి.
వయసు: ఇండియన్ మిలటరీ అకాడెమీ, నేవల్ అకాడెమీలకు జులై 2, 2002 - జులై 1, 2007 మధ్య జన్మించినవారు అర్హులు. ఎయిర్ ఫోర్స్ అకాడెమీ పోస్టులకు జులై 2, 2002 - జులై 1, 2006 మధ్య జన్మించాలి. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి గరిష్ఠ వయసులో రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు జులై 2, 2001 - జులై 1, 2007 మధ్య జన్మించినవారు అర్హులు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.06.2025
దరఖాస్తు ఫీజు: రూ.200. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఉండదు.
పరీక్ష తేదీ: 14.09.2025
వెబ్సైట్: https://upsconline.nic.in/
బీఈ/బీటెక్ విద్యార్హతతో ఆర్మీలో అవకాశం - తొలి నెల నుంచే లక్ష జీతం
వారికి గుడ్ న్యూస్ - వచ్చే ఏడాది నుంచి సరికొత్త డిగ్రీ కోర్సులు