Gram Suraksha Postal Scheme Details : ప్రస్తుత కాలంలో చాలా మంది పొదుపు వైపు అడుగులు వేస్తున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి కుటుంబ సభ్యుల కోసం తమకు తోచినంత డబ్బును ఆదా చేస్తున్నారు. అందుకే పలు పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే చాలా మంది డబ్బును ఇన్వెస్ట్ చేయడానికి పోస్ట్ ఆఫీసులను సంప్రదిస్తుంటారు. లాభాలు తక్కువగా ఉన్నా సరే, పొదుపు చేయడానికే ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వంటివి కొంచెం రిస్క్తో కూడుకున్నవి. ఈ క్రమంలోనే పోస్టాఫీసు వైపు మొగ్గు చూపుతారు. మరి మీరు కూడా తపాలా శాఖలో పొదుపు చేద్దామనుకుంటున్నారా? అది కూడా చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే మీకోసం అద్దిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. అదే "గ్రామ సురక్ష యోజన". దీనిలో పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తరవాత లక్షల రూపాయలను పొందవచ్చు. మరి, ఈ పథకంలో ఎలా చేరాలి? ఎవరు అర్హులు? ఎంత పెట్టుబడి పెట్టాలి? అనే వివరాలను తెలుసుకుందాం.
ఏమిటీ గ్రామ సురక్ష యోజన స్కీమ్?: గ్రామ సురక్ష యోజన పథకం అనేది "రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రోగ్రామ్లో ఓ భాగం. దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం తపాలా శాఖ 1995లో ఈ స్కీమ్ను ప్రారంభించింది. ఇక ఇందులో పెట్టుబడి పెట్టాలనుకునే వారు భారతీయులై ఉండి 19 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసులో ఉండాలి. గరిష్టంగా 60 ఏళ్ల టెన్యూర్ వరకు పెట్టుకోవచ్చు. అంటే మెచ్యూరిటీ పీరియడ్ 55 ఏళ్లు, 58 సంవత్సరాలు, 60 ఏళ్లు ఇలా మీకు నచ్చినది ఎంచుకోవచ్చు. ఈ పథకంలో రూ.10వేల నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. స్కీమ్కు సంబంధించి ప్రీమియం చెల్లించడానికి నెలవారీగా, త్రైమాసికంగా, అర్ధ సంవత్సరంగా వివిధ ఆప్షన్లు ఉన్నాయి. అందులో మీకు నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం పెట్టుబడి పెట్టొచ్చు.

నెలకు ఎంత చెల్లించాలి ? గ్రామ సురక్ష యోజన స్కీమ్లో చేరిన వ్యక్తి నెలకు రూ.1,515లను పొదుపు చేయాలి. అంటే రోజుకు 50 రూపాయలు. ఈ స్కీమ్లో పెట్టుబడి పెడితే మీరు తిరిగి రూ.30 నుంచి 35 లక్షల వరకు రాబడిని పొందవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయసులో రూ.10 లక్షల ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటే, అతను 55 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.1,515 లను ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు 50 రూపాయలన్నమాట. అదే అతను 58 సంవత్సరాలు ఎంచుకంటే నెలకు రూ.1,463, 60 సంవత్సరాల వరకైతే రూ.1,411 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం సకాలంలో చెల్లించకపోతే దానిని 30 రోజుల్లోపు డిపాజిట్ చేయవచ్చు.

రాబడి ఎలా ఉంటుంది ? మీరు ఈ స్కీమ్లో ఎన్ని సంవత్సరాలు పొదుపు చేశారు అనే దాని బట్టి మీకు రాబడి వస్తుంది. 55 ఏళ్ల వరకు స్కీమ్లో పెట్టుబడి పెడితే మీకు రూ.31.60 లక్షలు తిరిగి వస్తుంది. అదే 58 ఏళ్లకు 33.40 లక్షలు, 60 ఏళ్ల వయస్సు వరకు పెట్టుబడి పెడితే రూ.34.60 లక్షలు మెచ్యూరిటీ సమయంలో వస్తాయి. గ్రామ సురక్ష యోజన స్కీమ్ కింద 80 ఏళ్లు నిండిన వ్యక్తికి ఈ మొత్తాన్ని అందిస్తారు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే ఈ మొత్తాన్ని ఆ వ్యక్తి చట్టపరమైన వారసులకు లేదా నామినీకి అందిస్తారు. ఈ పాలసీ తీసుకున్న 3 సంవత్సరాల తరవాత పాలసీదారుడు స్వచ్ఛందంగా పథకాన్ని నిలిపేయవచ్చు. కానీ, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే, 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేస్తే బోనస్ వర్తిస్తుంది. పాలసీ తీసుకున్న 4 సంవత్సరాల తర్వాత లోన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇక ఈ పాలసీలో ముఖ్యమైనది తపాలా శాఖ అందించే బోనస్. తపాలా శాఖ ప్రకటించిన బోనస్లో ప్రతి రూ. 1,000కి సంవత్సరానికి రూ.60 లను బోనస్గా అందిస్తుంది.

ఈ పథకంలో ఎలా చేరాలి: ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టాలనుకున్నవారు దగ్గర్లోని పోస్టాఫీసుకు వెళ్లి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. మీకు నచ్చితే అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు, వివరాలు సమర్పించి ప్రీమియం చెల్లించి పాలసీ కొనుగోలు చేయవచ్చు. పూర్తి వివరాలు ఇండియన్ పోస్ట్ అధికారిక వెబ్సైట్ను విజిట్ చేయండి. లేదా ఈ లింక్పై క్లిక్ చేయండి.
పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ - పిల్లల పేరు మీద 6 రూపాయలు పొదుపు చేస్తే - లక్ష బెనిఫిట్!
2025లో మహిళల కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలు- రూ.లక్షల్లో సంపాదన, పొదుపు!