ITR Filing 2025 Key Changes : ఆదాయపు పన్ను రిటర్న్ల(ఐటీఆర్) ఫైలింగ్కు వేళైంది. 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించిన ఏడు ఐటీఆర్ ఫామ్లను ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ విడుదల చేసింది. ఈ ఫామ్ల ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి మనం ఐటీఆర్లను దాఖలు చేయొచ్చు.
ఎవరి కోసం ఏ ఫామ్ ?
ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన ఏడు ఐటీఆర్ ఫామ్లు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవి. ఒక్కో ఫామ్ ఒక్కో రకమైన అవసరం కోసం ఉపయోగపడుతుంది.
- ఐటీఆర్-1 (సహజ్), ఐటీఆర్-4 (సుగమ్) ఫామ్లు చిన్న, మధ్య తరహా పన్ను చెల్లింపుదారులకు సంబంధించినవి.
- ఐటీఆర్ -1 ఫామ్ అనేది వేతనం, ఇంటి అద్దెలు, వడ్డీ ఆదాయం ద్వారా రూ.50 లక్షల దాకా వార్షిక ఆదాయాన్ని గడించే వారికి సంబంధించినది. రూ.5వేల దాకా చిన్నతరహా వ్యవసాయ ఆదాయం పొందే వారు కూడా ఈ ఫామ్తోనే ఐటీఆర్ దాఖలు చేయాలి.
- మూలధన లాభాలు ఉన్నప్పటికీ, వ్యాపార ఆదాయం లేని వారు ఐటీఆర్-2 ఫామ్ను వాడాలి.
- వ్యాపారం లేదా వివిధ ప్రొఫెషన్స్ ద్వారా ఆదాయాన్ని పొందే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల కోసం ఐటీఆర్-3 ఫామ్ అందుబాటులో ఉంది.
- వ్యాపారం లేదా వివిధ ప్రొఫెషన్స్ ద్వారా రూ.50 లక్షల దాకా వార్షిక ఆదాయాన్ని పొందే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థల(firms) కోసం ఐటీఆర్-4 ఫామ్ అందుబాటులో ఉంది. అయితే లిమిటెడ్ లయబులిటీ పార్ట్నర్షిప్ (ఎల్ఎల్పీ) సంస్థలు దీని పరిధిలోకి రావు.
- సంస్థలు (firms), ఎల్ఎల్పీ సంస్థలు, కోఆపరేటివ్ సొసైటీల కోసం ఐటీఆర్-5 ఫామ్ అందుబాటులో ఉంది.
- కంపెనీల చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన కంపెనీల కోసం ఐటీఆర్-6 ఫామ్ అందుబాటులో ఉంది.
- ట్రస్టులు, ఛారిటబుల్ ఆర్గనైజేషన్లు ఐటీఆర్-7 ఫామ్ను సమర్పించాలి.
వేతనజీవులు, చిన్న పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్
ఈ సంవత్సరం ఒక పెద్ద మార్పు వేతన జీవులు, చిన్న వ్యాపారాల యజమానులను ప్రభావితం చేయనుంది. ఈ రెండు వర్గాల వారు లిస్టెడ్ షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్ల నుంచి పొందే దీర్ఘకాలిక మూలధన లాభాలు సంవత్సరానికి రూ. 1.25 లక్షల వరకు ఉంటే, ఇక నుంచి ఐటీఆర్-1 లేదా ఐటీఆర్ -4 ఫామ్లతో రిటర్న్లను దాఖలు చేయొచ్చు. గత సంవత్సరం వరకు వారు ఎంతో క్లిష్టమైన ఐటీఆర్-2 ఫామ్ను ఉపయోగించాల్సి వచ్చింది. ఐటీఆర్-1, ఐటీఆర్ -4 ఫామ్లను వేతన జీవులు, చిన్న వ్యాపారాల యజమానులు ఈజీగా, వేగంగా నింపొచ్చు.
ఈ మార్పు ఎందుకు?
వేతన జీవులు, చిన్న వ్యాపారాల యజమానులు లిస్టెడ్ ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్ల నుంచి రూ.1.25 లక్షల వరకు దీర్ఘకాలిక మూలధన లాభాలను పొందితే, వాటిపై ట్యాక్స్ ఉండదు. ఒకవేళ దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.1.25 లక్షలకు మించితే, అదనపు మొత్తంపై 12.5 శాతం పన్ను విధిస్తారు.
మూలధన లాభాల నివేదనలో పెద్ద మార్పు
మూలధన లాభాలను నివేదించే విషయానికి వస్తే, ఐటీఆర్-2, 3, 5, 6, 7 ఫామ్లలో ఒక కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే లాభాలను 2024 జులై 23కు ముందు, 2024 జులై 23 తర్వాత అనే రకాలుగా వర్గీకరించుకోవాలి. 2024 జూలై 24న చేసిన కేంద్ర బడ్జెట్ ప్రకటన ప్రకారం ఈ మార్పు చేశారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్పై విధించే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 20 శాతం(ఇండెక్సేషన్) నుంచి 12.5 శాతానికి (ఇండెక్సేషన్ క్లెయిమ్ చేయకుండా) తగ్గించింది. అయితే 2024 జులై 23కు ముందు కొన్న ఆస్తులకే ఈ తగ్గింపు వర్తిస్తుంది. మనకు ఏ పన్ను పద్ధతి ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుందో, దాన్నే ఎంచుకునే వెసులుబాటు ఇచ్చారు.
మధ్యతరగతి వ్యాపారులపై తగ్గనున్న భారం
సాధారణంగా వ్యాపార యజమానులు, నిపుణులు, ప్రొఫెషనల్స్ ఐటీఆర్ -3 ఫామ్ను దాఖలు చేస్తుంటారు. వీరికి ఈసారి నుంచి ఫామ్ సమర్పణలో కొంత ఉపశమనం లభించనుంది. ఈ కేటగిరీలోని వారు గతంలో తమ సంపద మొత్తం విలువ రూ. 50 లక్షలు దాటితే తమ ఆస్తులు, అప్పుల వివరణాత్మక జాబితాను 'షెడ్యూల్ AL'లో ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు సంపద మొత్తం విలువకు సంబంధించిన పరిమితిని రూ.1 కోటికి పెంచారు. అందుకే నెట్ వర్త్ (నికర సంపద విలువ) రూ.1 కోటి లోపు ఉన్నవారు ఇక నుంచి ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈ మార్పు వల్ల ప్రధానంగా మధ్యతరగతి వ్యాపార యజమానులకు ప్రయోజనం చేకూరుతుంది.
గడువు తేదీ జులై 31
ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. మీ ఖాతాలకు ఆడిటింగ్ అవసరం లేకపోతే, చివరి నిమిషం వరకు వేచి ఉండకపోవడమే బెటర్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంస్కరణల వల్ల ఐటీఆర్ దాఖలు ప్రక్రియ సులభతరం కానుంది. తక్కువ ఆదాయ వర్గాల వారికి ఊరట దక్కనుంది. ముఖ్యంగా వేతన జీవులు, చిరు వ్యాపారులు, ఆస్తిని అమ్మే వారికి ప్రయోజనం చేకూర్చేలా ఈ మార్పులు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఐటీఆర్ను దాఖలు చేసేముందు ఎవరికి ఏ ఫామ్ అవసరం అనే దానిపై క్లారిటీకి రావాలి. కొత్త రూల్స్ను తెలుసుకోవాలి.