Gadkari On Vehicle Horns : వాహనాల విషయంలో కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. భారతీయ సంగీత వాయిద్యాల నుంచి వచ్చే శబ్దాన్ని మాత్రమే వాహనాలకు హారన్గా వినియోగించుకునేలా ఓ చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల వాహనాలకు భారతీయ సంగీత ధ్వనులే హారన్గా ఉంటాయని, దీంతో వినడానికి ఆహ్లాదకరంగా కూడా ఉంటుందని అన్నారు. 'నవభారత్ టైమ్స్' 78వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ మేరకు మాట్లాడారు.
ఫ్లూట్, తబలా, వయెలిన్, హార్మోనియం వంటి వాయిద్య పరికరాల ద్వారా రూపొందించిన శబ్దాన్నే అన్ని వాహనాలకు వినియోగించేలా చట్టం తీసుకురావాలని అనుకుటున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలో మొత్తం వాయు కాలుష్యంలో రవాణా రంగం వాటా 40 శాతం వరుకు ఉంటుందని చెప్పారు. అందువల్లే తమ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు మిథనాల్, ఇథనాల్ వంటి బయో-ఇంధనంతో నడిచే వాహనాలను ప్రోత్సహిస్తోందని అన్నారు. భారతదేశం ద్విచక్ర వాహనాలు, కార్ల ఎగుమతుల ద్వారా అత్యధిక ఆదాయాన్ని పొందుతోందని గడ్కరీ తెలిపారు. 2014లో భారత ఆటోమొబైల్ రంగం విలువ రూ.14 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఇక ఆటోమొబైల్ రంగంలో అమెరికా, చైనా తర్వాత భారతదేశం ఉందన్నారు. జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్గా అవతరించిందని పేర్కొన్నారు.