Budget 2025 Big Gifts For Bihar : ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్కు కేంద్ర బడ్జెట్లో భారీగా కేటాయింపులు జరిగాయి. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి బిహార్లో అధికారంలో ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటనలపై బిహార్లోని ఎన్డీఏ కూటమి నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తమ రాష్ట్రానికి సముచిత ప్రాధాన్యం దక్కిందని అంటున్నారు. "బిహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీని ఏర్పాటు చేయనుండటం సంతోషకరం. దీనివల్ల రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం బలోపేతం అవుతుంది. దీనివల్ల రైతుల ఆదాయాలు పెరుగుతాయి. పంట ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది" అని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. "బిహార్లో మఖానా బోర్డ్ ఏర్పాటు మంచి విషయం. దీనివల్ల రాష్ట్రంలోని రైతులు, వ్యాపారులకు కొత్త తలుపులు తెరుచుకుంటాయి. వ్యవసాయ రంగానికి ఊతం లభిస్తుంది. ఫలితంగా ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ ప్రక్రియలు కూడా వేగాన్ని పుంజుకుంటాయి" అని జేడీయూ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా తెలిపారు.
ఈ బడ్జెట్లో బిహార్కు దక్కినవి ఇవే!
- బిహార్ పరిధిలో మఖానా సాగును ప్రోత్సహించేందుకు మఖానా బోర్డు ఏర్పాటు.
- పశ్చిమ కోశీ కెనాల్ ప్రాజెక్టుకు నిధులను కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో రాష్ట్రంలోని మిథిలాంచల్ ప్రాంతంలో దాదాపు 50వేల హెక్టార్ల సాగుభూమి ఉంది.
- ఐఐటీ పాట్నా విస్తరణకు సహాయ సహకారాలు
- బిహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఏర్పాటు
- బిహార్ రాజధాని పాట్నాలో ఉన్న విమానాశ్రయ విస్తరణ.
- రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సౌకర్యాల కల్పన. బిహ్తాలో బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు.
బిహార్కు చెందిన మధుబని చీరతో నిర్మల
ఇవాళ బిహార్కు చెందిన మధుబని కళారూపంతో కూడిన చీరను ధరించి పార్లమెంటుకు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వచ్చారు. చీరపై అందమైన చేపల ఆకారాల ప్రింట్స్ కూడా ఉన్నాయి. ఈ చీరను పద్మశ్రీ దులారీ దేవీ 2021 సంవత్సరంలో నిర్మలకు బహుమతిగా ఇచ్చారు. బిహార్లోని మధుబని జిల్లాకు నిర్మల వెళ్లినప్పుడు ఈ చీరను దులారీ దేవీ ఇచ్చారు. బడ్జెట్ ప్రసంగం చేసే సమయంలో దీన్ని ధరించాలని కోరారు.
బిహార్కు బొనాంజా- ఏపీకి మొండిచెయ్యి: కాంగ్రెస్
కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ఈ బడ్జెట్ బిహార్కు బొనాంజా ఇచ్చినట్టుగా కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. బిహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఆ రాష్ట్రానికి మాత్రమే పెద్దపీట వేశారని ఆయన విమర్శించారు. ఎన్డీఏ కూటమికి మరో పునాది లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరీ దారుణంగా ఎందుకు విస్మరించారని జైరాం రమేశ్ ప్రశ్నించారు. "సక్షం అంగన్వాడీ అండ్ పోషణ్ 2.0 స్కీం ద్వారా అంగన్వాడీ పాఠశాలల్లో అల్పాహారం, గ్లాసు పాలు ఇవ్వాలనే డిమాండ్ను ఆర్థిక మంత్రి నేటికీ పరిగణనలోకి తీసుకోలేదు. కర్ణాటకలో అమలవుతున్న క్షీర భాగ్య స్కీం ద్వారా ఇవన్నీ మా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోంది. అంగన్వాడీ వర్కర్ల గౌరవ వేతనాన్ని కూడా మేం పెంచాం" అని ఆయన పేర్కొన్నారు. "కనీసం ఇలాంటి కేటాయింపులు చేయకుండా, మీరు ప్రజలపై ఎలాంటి పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారు?" అని జైరాం రమేశ్ ప్రశ్నించారు.
SC, ST మహిళలకు గుడ్ న్యూస్- రూ.2 కోట్ల బిజినెస్ లోన్ మంజూరు!