Anant Ambani News Today : ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) హోల్ టైమ్ డైరెక్టర్గా నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మానవ వనరులు, నామినేషన్, వేతన కమిటీ సిఫార్స్ల ఆధారంగా బోర్డ్ ఈ నియామకానికి ఆమోదం తెలిపింది. వాటాదారుల ఆమోదానికి లోబడి 2025 మే 1 నుంచి 5 సంవత్సరాల వరకు అనంత్ అంబానీ హోల్-టైమ్ డైరెక్టర్గా ఉంటారని కంపెనీ తన స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్లో తెలిపింది.
అనంత్పై చాలా బాధ్యతలు ఉన్నాయ్!
అనంత్ అంబానీ ఇప్పటి వరకు రిలయన్స్ బోర్డ్లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. ఇప్పుడు పెద్ద కంపెనీకి పూర్తికాల డైరెక్టర్గా నియమితులయ్యారు. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అనంత్ ఏడాదికి రూ.4.2కోట్ల వేతనం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఫుల్ టైమ్ డైరెక్టర్గా నియామకమైన ఆయన వేతనం అంతే ఉంటుందా? పెంచుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్తోపాటు అనేక రిలయన్స్ గ్రూప్ సంస్థల్లో పనిచేస్తున్నారు. జియో ప్లాట్ఫామ్స్లో (2020 మార్చి నుంచి), రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో (2022 మే నుంచి), రిలయన్స్ న్యూ ఎనర్జీ అండ్ రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీలో (2021 జూన్ నుంచి) బోర్డ్ సభ్యుడిగా ఉన్నారు. 2022 సెప్టెంబర్ నుంచి రిలయన్స్ ఫౌండేషన్ బోర్డ్ సభ్యుడిగానూ అనంత్ అంబానీ పనిచేస్తున్నారు.
ముచ్చటగా ముగ్గురూ
రిలయన్స్ గ్రూప్ సంస్థల్లో అంబానీల వారసులు తమదైన రీతిలో పని చేస్తున్నారు. ఇప్పటికే అనంత్ అంబానీతోపాటు ఆకాశ్, ఇషా అంబానీలు రిలయన్స్ బోర్డ్లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నారు.
ఆకాశ్ అంబానీ గ్రూప్ టెలికాం, డిజిటల్ సేవల విభాగమైన 'రిలయన్స్ జియో ఇన్ఫోకామ్'కు ఛైర్మన్గా పనిచేస్తున్నారు. ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు.
అనంత్ స్పెషాలిటీ ఇదే!
అనంత్ అంబానీ అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన జంతు సంక్షేమం పట్ల చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రమాదంలో ఉన్న జంతువులకు పునరావాసం కల్పించి, వాటిని సంరక్షిస్తూ ఉంటారు. అదే సమయంలో కార్పొరేట్ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటారు.
రిలయన్స్ క్యూ4 ఫలితాలు
రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025 మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో 2.4 శాతం మేర ఏకీకృత లాభాలు పొందినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది. కంపెనీ నికర లాభం గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.18,951 కోట్లు ఉంటే, ఇప్పుడు అది రూ.19,407 కోట్లకు పెరిగిందని తెలిపింది.
మొత్తంగా చూసుకుంటే, ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 9.91 శాతం పెరిగి రూ.2,64,573 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.2,40,715 కోట్లుగా ఉంది.
అక్షయ తృతీయ ఆఫర్- ఫోన్పే & పేటీఎంలో గోల్డ్ కొంటే భారీ డిస్కౌంట్ & క్యాష్బ్యాక్