DGCA Advisory To Airlines: పాకిస్థాన్ ఎయిర్స్పేస్ మూసివేత కారణంగా భారత్ నుంచి రాకపోకలు సాగించే అంతర్జాతీయ విమానాలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. ముఖ్యంగా విమానాల ప్రయాణ సమయం బాగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఏవియేషన్ వాచ్డాగ్ డీజీసీఏ విమానయాన సంస్థలకు కీలక సూచనలు చేసింది. విమాన ప్రయాణికులకు సరైన కమ్యూనికేషన్ సౌకర్యాలతోపాటు, క్యాటరింగ్ సేవలు అందించాలని సూచించింది.
పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారతదేశం, పాకిస్థాన్పై పలు ఆంక్షలు విధించింది. దీనితో పాకిస్థాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. భారతీయ విమానాలు తమ గగనతలంలో ప్రయాణించడానికి వీలులేకుండా ఆంక్షలు విధించింది. దీనితో అంతర్జాతీయ విమానాలకు, ముఖ్యంగా దిల్లీతో సహా ఉత్తర భారత నగరాల నుంచి బయలుదేరే విమానాల ప్రయాణ సమయం బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానయాన సంస్థలకు కీలక సూచనలు చేసింది.
ప్రయాణికుల కోసం ఇవి చేయాల్సిందే!
- పాక్ తన గగనతలాన్ని మూసివేయడం సహా ఓవర్ఫ్లైట్ పరిమితుల వల్ల విమాన సర్వీసులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని డీజీసీఏ పేర్కొంది. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ విమానాల రూట్లను మార్చాల్సి వస్తోంది. షెడ్యూల్ చేసిన సమయం కంటే బ్లాక్ టైమ్ పెరుగుతోంది. సాంకేతికంగా చూస్తే, ఆపరేషనల్ లేదా ఇంధన అవసరాల కోసం మార్గంమధ్యలో ఫ్లైట్స్ ఆగిపోయే అవకాశం ఉంది.
- బ్లాక్ టైమ్ అంటే ఒక విమానం బయలుదేరే ప్రదేశం నుంచి గమ్యస్థానానికి చేరేందుకు పట్టే వ్యవధి. ఇప్పుడిది బాగా పెరిగిపోయింది. కనుక విమానాలు వచ్చే సమయం, వెళ్లే సమయం (రాకపోకలకు సంబంధించిన టైమింగ్స్) గురించి ముందుగానే ప్రయాణికులకు తెలియజేయాలని డీజీసీఏ- విమానయాన సంస్థలకు సూచించింది.
- అంతర్జాతీయ విమాన సర్వీస్ల విషయంలోనూ కీలక సూచనలు చేసింది. ఎక్కువ దూరం ప్రయాణించే విమానాలు మధ్యలో ఏదో ఒక విమానాశ్రయంలో ఆగుతాయి. దీనిని టెక్నికల్ హాల్ట్ లేదా స్టాప్ అంటారు. ఈ సమయంలో ప్రయాణికులు కిందకు దిగకుండా విమానంలోనే ఉండాల్సి ఉంటుంది. దీనితో వారు ఇబ్బందిపడే ఛాన్స్ ఉంది. కనుక ఈ విషయాన్ని ముందుగానే ప్రయాణికులకు చెప్పాలని డీజీసీఏ సూచించింది.
- చెక్-ఇన్, బోర్డింగ్ గేట్ల దగ్గర, అలాగే సాధ్యమైన చోట్ల ప్రయాణికులకు ఎస్ఎంఎస్/ఈ-మెయిల్స్ ద్వారా సమాచారాన్ని తెలియజేయాలి.
- ఎక్కువ దూరం ప్రయాణించే విమానాల్లోని ప్యాసింజర్లకు (టెక్నికల్ హోల్ట్లతో సహా) భోజనం, పానీయాలు అందుబాటులో ఉంచాలి.
- అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు కావాల్సిన వైద్య సామగ్రిని, ప్రథమ చికిత్స కిట్లను సిద్ధంగా ఉంచాలి.
- ఎయిర్లైన్స్ కచ్చితంగా కస్టమర్ సర్వీస్ను అందించాలి. దీని ద్వారా ఫ్లైట్ ఆలస్యం, షెడ్యూల్ అంతరాయాల గురించి ప్రయాణికులకు లేదా వారి కుటుంబ సభ్యులకు తెలియజేయాలని డీజీసీఏ సూచించింది.
ఆంక్షల ఎఫెక్ట్
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు 26 మంది చంపి మారణహోమం సృష్టించారు. దీనితో భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. రెండు దేశాలు పరస్పరం పలు ఆంక్షలు విధించుకున్నాయి. ఇందులో భాగంగా భారత్ విమానాలు తమ గగనతలంలో ప్రవేశించకుండా పాక్ ఆంక్షలు విధించింది.
ఇండిగో విమానం నడుపుతున్న దాదాపు 50 అంతర్జాతీయ విమానాలను ఇప్పుడు రీషెడ్యూల్, రీరూటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అల్మట్టి, తాష్కెంట్ ఇండిగో ఆపరేషనల్ రేంజ్కు వెలుపల ఉన్నాయి. కనుక అల్మట్టి స్టాండ్కు ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు. తాష్కెంట్కు ఏప్రిల్ 28 నుంచి మే 7 వరకు విమానాలు రద్దు చేశారు.
భార్య పేరు మీద రూ.2లక్షలు డిపాజిట్ చేస్తే రూ.32వేల వడ్డీ- ఈ స్కీమ్ గురించి తెలుసా?
ఈ చిన్న అలవాట్లు ఉంటే- మీ క్రెడిట్ స్కోర్ ఇట్టే పెరుగుతుంది!