WHO On Air Pollution : దేశంలో గాలి నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే చాలా తక్కువగా ఉంది. దేశ జనాభాలో 40% కంటే ఎక్కువ మంది ఇప్పటికీ వంట చేసుకోవడానికి కాలుష్య కారకాలైన కట్టెలు, పిడకలను ఉపయోగిస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ పర్యావరణం, వాతావరణ మార్పు, ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ మరియా నీరా (Dr.Maria Neira), భారత్లో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు తక్షణ చర్యలు అవసరమని పిలుపునిచ్చారు.
డాక్టర్ నీరా తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, గృహ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి భారతదేశం ఎల్పీజీ సబ్సిడీ వంటి పథకాలను విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎక్కువ మందికి చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. "పథకాల నుంచి మంచి ఫలితాలను చూశాం. కానీ 41% భారతీయ గృహాలు ఇప్పటికీ బయోమాస్ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇంకా ఎక్కువ కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎల్పీజీ, బయోగ్యాస్ లేదా ఇథనాల్ వంటి క్లీనర్ ఫ్యూయల్స్కి మారడం వల్ల ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. వాయు కాలుష్యంతో ముడిపడి ఉన్న మరణాలు, అనారోగ్యాల సంఖ్యను తగ్గించవచ్చు" అని తెలిపారు.
"గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి నాన్కమ్యూనికబుల్ డిసీజ్లు (NCDs) రావడానికి వాయు కాలుష్యం ఒక ప్రధాన కారణం. సెప్టెంబర్లో జరగబోయే యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరుగుతుంది. వాయు కాలుష్యంపై మనం పోరాడుతున్నప్పుడు, NCDల ముప్పు కూడా తగ్గుతుంది. ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్లో ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, వాయు కాలుష్యం కేవలం ఢిల్లీ సమస్య మాత్రమే కాదు. భారతదేశంలోని అనేక ప్రాంతాలు WHO మార్గదర్శకాల కంటే చాలా దారుణమైన గాలి నాణ్యతను ఎదుర్కొంటున్నాయి. కొన్ని ప్రాంతాలు మరింత దారుణమైన స్థాయికి చేరుకున్నాయి" అని నీరా వివరించారు.
డాక్టర్ నీరా డబ్ల్యూహెచ్ఓ గ్రీన్ పేజ్ టూల్ గురించి కూడా మాట్లాడారు. "ఇది పిల్లల హెల్త్ రికార్డుల్లో ఎన్విరాన్మెంటల్ రిస్కులను ట్రాక్ చేయడానికి డాక్టర్లకు సహాయపడుతుంది. ఇందులో భాగంగా కాలుష్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటికి తగిన చికిత్స అందించేలా డాక్టర్లకు శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా చేపడుతున్నారు." అని తెలిపారు.
"ఆయా ప్రాంతాల్లో మహిళల నేతృత్వంలో పరిశుభ్రమైన గాలి కోసం జరుగుతున్న పోరాటాలను నీరా ప్రశంసించారు. ఈ సమూహాలు శక్తివంతమైనవి. చాలా మారుమూల ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వాటిని ఒకచోట చేర్చి, వాటి ప్రభావాన్ని పెంచడం మా బ్రీత్ లైఫ్ క్యాంపెయిన్లో భాగంగా ఉన్నాయి" అని చెప్పారు. సుమారు 50 దేశాలు, నగరాలు గాలి నాణ్యత పెంచడానికి చేసిన వాగ్దానాలను WHO ట్రాక్ చేస్తోందని డాక్టర్ నీరా అన్నారు. నాణ్యతను పర్యవేక్షించడానికి తగిన సిస్టమ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాగ్దానాలు కార్యరూపం దాల్చేలా చూసుకోవడానికి UN ఏజెన్సీలు, స్థానిక సంస్థలో కలిసి పని చేస్తున్నామని చెప్పారు.