Vijay Speech In Coimbatore : తమది రాజకీయ లబ్ధి కోసం ప్రారంభించిన పార్టీ కాదని తమిళగ వెట్రీ కజగం (TVK) అధ్యక్షుడు, ప్రముఖ తమిళ హీరో విజయ్ తెలిపారు. ప్రజలకు మంచి జరుగుతుందంటే ఎంతవరకైనా వెళ్లడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి ఉండదని తెలిపారు. కోయంబత్తూర్లో జరిగిన టీవీకే బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"నా హృదయంలో ఉండే కోయంబత్తూర్ వాసులకు నా శుభాకాంక్షలు. నేను ఇటీవల మాట్లాడినప్పుడు ఈ సమావేశం ఓట్ల కోసం కాదని చెప్పాను. పోలింగ్ ఏజెంట్లు నేరుగా ప్రజల్ని కలవండి. వారికి మమేకం అవ్వండి. ప్రజలతో కలిసి జీవించండి. ప్రజలతో ఉండి వారికి సేవ చేయమని అన్నాదురై నినాదం ఇచ్చారు. మీరు దీన్ని అర్థం చేసుకుని తదనుగుణంగా నడుచుకోండి. టీవీకే పాలన స్పష్టమైన, నిజమైన, పారదర్శకంగా ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేవారికి సహాయం చేయడం మన కర్తవ్యం. పండగలకు కుటుంబ సమేతంగా దేవాలయాలకు వెళ్లినట్లే, ఓట్ల పండగను వేడుకగా చేయాలి. మనం ప్రజల్లో అలాంటి ఆలోచనను సృష్టించాలి. టీవీకే విజయం సాధించడానికి మీ కృషి చాలా ముఖ్యం. పోలింగ్ బూత్ ఏజెంట్లే పార్టీకి వెన్నెముక. దాన్ని మనసులో ఉంచుకుని తదనుగుణంగా వ్యవహరించండి. పార్టీని బలపరచండి. " -- విజయ్, టీవీకే అధినేత
'ఎవరితోనూ రాజీపడబోము'
తమ పార్టీ ఎవరితోనూ రాజీపడబోదని విజయ్ స్పష్టం చేశారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది స్వచ్ఛమైన సర్కార్ అవుతుందని తెలిపారు. ఎందుకంటే తమ ప్రభుత్వంలో నేరస్థులు ఉండరని పేర్కొన్నారు. అందుకే టీవీకే పోలింగ్ ఏజెంట్లు ధైర్యంగా ప్రజలను నేరుగా కలవాలని కోరారు.
బూత్ కమిటీ సభ్యుల సమావేశం
ఏప్రిల్ 26, 27 తేదీల్లో టీవీకే బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. రెండో రోజున (ఆదివారం) కోయంబత్తూరులోని కురుంబపాళయం ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన మీటింగ్కు టీవీకే అధ్యక్షుడు విజయ్ హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున తదితరులు హాజరయ్యారు.
వేలాదిగా అభిమానులు
మీటింగ్ వచ్చిన విజయ్ కు వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. అతడి రాక నేపథ్యంలో కోయంబత్తూర్లో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో కళాశాల ప్రాంగణంలోని రోడ్డుపై విజయ్ కోసం వేచి ఉన్న ఓ యువతి అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయింది. అక్కడ విధుల్లో ఉన్న అన్నూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సెల్వన్ వెంటనే యువతిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.