India Pakistan Border : జమ్ముకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వెంట మరోసారి కాల్పుల కలకలం రేగింది. రెచ్చగొట్టే ధోరణితో పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. వెంటనే భారత సైన్యం అప్రమత్తమై ప్రతిదాడులు జరిపింది. సమర్థంగా తిప్పికొట్టింది.
ఏప్రిల్ 25-26 అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి పలు పోస్టుల నుంచి పాక్ ఆర్మీ కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. ఏప్రిల్ 24-25 అర్ధరాత్రి వేళ కూడా పాక్ ఎల్ఓసీ వద్ద కాల్పులు జరిపింది.
పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భారత్, పాక్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచివెళ్లాలని ఆదేశించింది.
దీంతో ఆ చర్యలతో దాయాది అక్కసు వెళ్లగక్కుతోంది. సిమ్లా ఒప్పందంతోపాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది. తమ గగనతలంలో భారత్కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. అలాంటి పరిణామాల వేళ సరిహద్దుల్లో కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.
మరోవైపుస పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ముస్లింలు శుక్రవారం ప్రార్థనల అనంతరం ప్రదర్శనలు చేపట్టారు. చేతికి నల్లరంగు బ్యాండ్లు ధరించి నిరసన తెలిపారు. పాకిస్థాన్కు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాజా దాడి నేపథ్యంలో పాక్పై దౌత్యపరంగా, సైనికపరంగా కఠిన చర్యలకు ఉపక్రమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు- పహల్గాంలో దాడికి పాల్పడిన వ్యక్తులు తమను తాము ముస్లింలుగా చెప్పుకొంటున్నప్పటికీ వారి చర్య ఇస్లామ్ మతానికి పూర్తి విరుద్ధమైనదని దిల్లీలోని చారిత్రక జామా మసీద్ షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ వ్యాఖ్యానించారు.
కశ్మీరీ పండిట్లే ఉగ్రవాదుల టార్గెట్?- ఫుల్ అలెర్ట్లో ఇండియన్ ఆర్మీ