Ujjain Bhandara World Record : హనుమాన్ జయంతి వేళ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. నగరంలోని అంబాపూర్లో ఉన్న పురాతన జైవీర్ హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక భోజన కార్యక్రమం (భండారా) గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. నాగర్ భోజ్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 50 వేల మంది హనుమాన్ భక్తులు ఏకకాలంలో ఆలయ ప్రసాదాన్ని తిన్నారు. వారంతా ఆలయ ప్రాంగణంలో బల్లలు, కుర్చీలపై కూర్చొని సాంప్రదాయ మాల్వా వంటకాలైన దాల్ బఫ్లా, లడ్డూ, కడీలను భుజించారు. భక్తులకు 600 మంది కార్మికులు ఆహారాన్ని వడ్డించారు.
లార్జ్ స్కేల్ ఫుడ్ సర్వింగ్ ఆన్ చైర్-టేబుల్’ విభాగంలో
ఈ సామూహిక భోజన కార్యక్రమంలో వడ్డించిన వంటకాలను 70 మంది పాకశాస్త్ర నిపుణులతో కూడిన బృందం తయారు చేసింది. వీటి తయారీ కోసం 45 క్వింటాళ్ల బాఫ్లా గోధుమ పిండి, 7 క్వింటాళ్ల కంది పప్పు, 5 క్వింటాళ్ల పెరుగు, 6 క్వింటాళ్ల రవ్వ, 200 లీటర్ల పాలు, 25 డబ్బాల దేశీ నెయ్యి, 60 కిలోల డ్రై ఫ్రూట్స్ను వినియోగించారు. ఏకకాలంలో 50వేల మందితో జరిగిన ఈ విందు కార్యక్రమాన్ని దిల్లీకి చెందిన గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం లార్జ్ స్కేల్ ఫుడ్ సర్వింగ్ ఆన్ చైర్-టేబుల్ విభాగం చేర్చింది. రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్ను జైవీర్ హనుమాన్ ఆలయ కమిటీ నిర్వాహకులకు ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ఆసియా హెడ్ డాక్టర్ మనీష్ విష్ణోయ్, న్యాయ నిర్ణేత వేదాంత్ జోషి ప్రదానం చేశారు.


అచంచల భక్తిభావం వల్లే ఇది సాధ్యమవుతోంది : జైవీర్ హనుమాన్ ఆలయ కమిటీ
"జైవీర్ హనుమాన్పై మాకున్న అచంచల భక్తిభావం వల్లే గత 20 ఏళ్లుగా ఈ భారీ సామూహిక భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. హనుమంతుడిపై ఉన్న భక్తే మాకు ఈ దిశగా స్ఫూర్తిని ఇస్తోంది. ఈ సంవత్సరం భక్తుల సంఖ్య బాగా పెరిగింది. అందుకే మేం ఈ ఘట్టాన్ని రికార్డు పుస్తకాల్లో నమోదు చేయించాం" అని ఆలయ కమిటీ నిర్వాహకుడు సునీల్ చావంద్ తెలిపారు.