Hanuman Garhi Priest Ayodhya Ram Mandir : 288 ఏళ్ల పురాతన సంప్రదాయాన్ని పక్కనపెట్టి అయోధ్యలో కొలువైన రాముడిని దర్శించుకున్నారు హనుమాన్ గఢీ ఆలయ ప్రధాన అర్చకుడు మహంత్ ప్రేమ్ దాస్. బుధవారం అక్షయ తృతీయ సందర్భంగా రాంలల్లాను దర్శించుకోవడానికి ఆయన ఊరేగింపుగా రామాలయానికి వెళ్లారు. ఈ వేడుకలో ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు భాగమయ్యాయి. ప్రధాన అర్చకుడి వెంట నాగ సాధువులు, వారి శిష్యులు, భక్తులు ఉన్నారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు సరయూ నది తీరానికి చేరుకుని, అక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు మహంత్ ప్రేమ్ దాస్. ఆ తర్వాత నదిలో క్షీరాభిషేకం చేసి, 11 మీటర్ల పొడవైన వస్త్రాన్ని అందులో విడిచిపెట్టారు. అనంతరం అయోధ్యకు ఊరేగింపుగా చేరుకున్నారు.
బాలరాముడికి 56 రకాల వంటకాలు సమర్పణ
మహంత్ ప్రేమ్ దాస్ శోభా యాత్ర రామ్ పథ్ మీదుగా రామాలయ ప్రాంగణానికి చేరుకుని పూజలు చేశారు. అలాగే బాలరాముడికి 56 రకాల వంటకాలను నైవేధ్యంగా సమర్పించారు. అంతకుముందు సరయూ నదిలో పుణ్య స్నానమాచరించిన తర్వాత నాగ సాధువులతో కలిసి ఇటీవలే పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన పర్యటకుల మృతికి నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అదే సమయంలో బాబ్రీ మసీదుకు చెందిన ఇక్బాల్ అన్సారీ రామమందిరం గేటు నంబర్ 3 వద్ద మహంత్ ప్రేమ్ దాస్కు స్వాగతం పలికారు. చరిత్రలో తొలిసారిగా హనుమాన్ గఢీ ఆలయ మహంత్ అయోధ్య రామయ్య దర్శనానికి వస్తున్నారని తెలిపారు. అయోధ్యలో సంప్రదాయం ప్రకారం ఆయన్ను స్వాగతించామని వెల్లడించారు.


అధికారులు అలర్ట్
హనుమాన్ గఢీ ఆలయ ప్రధాన అర్చకుడు మహంత్ ప్రేమ్ దాస్ అయోధ్య పర్యటన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా మేజిస్ట్రేట్ నిఖిల్ కుమార్, ఎస్ ఎస్పీ రాజ్కరణ్ నయ్యర్, ఇతర అధికారులు మహంత్పై పూల వర్షం కురిపించారు. సరయూ నదిలో మహంత్ పుణ్యస్నానమాచరించిన తర్వాత రామాలయానికి ఊరేగింపుగా వెళ్లారని, భక్తులను మరొక మార్గం గుండా తరలించామని ఎస్ఎస్పీ రాజ్ కరణ్ తెలిపారు. ఊరేగింపు కారణంగా ఎవరికీ ఇబ్బందులు తలెత్తుకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

ఆచారాన్ని పక్కనపెట్టి
అయోధ్యలో ఉన్న హనుమాన్ గఢీ దేవాలయం దాదాపు 32 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. శతాబ్దాలుగా వస్తున్న ఆచారాల ప్రకారం ఆలయ అధిపతి (గద్దీ నషీన్) జీవితాంతం మందిర ప్రాంగణం నుంచి బయటకు వెళ్లరు. 18వ శతాబ్దంలో ఆలయ స్థాపనతో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఆలయ ప్రధాన అర్చకుడు మహంత్ ప్రేమ్ దాస్ ఇటీవల రామాలయాన్ని దర్శించాలనే కోరికను వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని నిర్వాణి అఖాడా దృష్టికి తీసుకెళ్లగా అక్కడి సభ్యులు దీనికి ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో మహంత్ ప్రేమ్ దాస్ 288 ఏళ్ల ఆచారాన్ని పక్కన పెట్టి అయోధ్య రామయ్యను దర్శించుకున్నారు.
VIDEO | Uttar Pradesh: Two-minute silence was observed after the Shahi Snan, joined by Naga sadhus in Ayodhya, to pay respect to victims of Pahalgam terror attack. Here's what the head priest of Hanuman Garhi Temple had to say:
— Press Trust of India (@PTI_News) April 30, 2025
" with folded hands, i humbly pray to hanuman ji… pic.twitter.com/3tzGSU5B7b
చార్ ధామ్ యాత్ర ప్రారంభం- తెరుచుకున్నగంగోత్రి, యమనోత్రి తలుపులు