Stalin on Central Government : కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విరుచుకుపడ్డారు. తమిళనాడులో 2026లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపైన స్పందిస్తూ, దిల్లీ పరిపాలనకు తమిళనాడు లొంగదన్నారు. ఆ ప్రత్యేకత తమిళనాడుకు ఉందని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల తరహాలో పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ఇక్కడ కుదరదని స్పష్టం చేశారు. 2026 ఎన్నికల్లో కూడా తమ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటికే భాషా వివాదం నేపథ్యంలో ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని స్టాలిన్ చెప్పారు. తమిళనాడుకు నీట్ నుంచి మినహాయింపు ఇస్తామని, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయబోమని అమిత్ షా హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజనతో (పార్లమెంటరీ ఎన్నికల్లో) సీట్లను తగ్గించమని చెప్పగలరా స్టాలిన్ అని నిలదీశారు. ఇటీవల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమిళనాడు ప్రజలను కించపరిచేలా మాట్లాడారని, అమిత్షా సైతం అదే విధమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారమే కేంద్రం, రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని, ఎవరూ ఎవరికి సబార్డినేట్ కాదని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చెప్పారని గుర్తుచేశారు.
కాగా జాతీయ విద్యలో త్రిభాషా సూత్రం, డీలిమిటేషన్ మొదలైన విషయాలపై తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో తీవ్రంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై విస్తృతంగా పోరాటం చేస్తోంది స్టాలిన్ ప్రభుత్వం. దీని కోసం ఇటీవల ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల స్వయం సాధికారత కోసం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుందని చెప్పారు. రాష్ట్రాల చట్టబద్ధ హక్కులను పరిరక్షించడంతోపాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కమిటీని ఏర్పాటు చేశామని స్టాలిన్ వివరించారు. మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో అన్నాడీఎంకే కలిసి పోటీ చేయనుంది. ఈ క్రమంలోనే మాట్లాడిన అమిత్ షా, 2026లో తమిళనాట అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.