Stalin On State Autonomy : గవర్నర్ ఆర్ఎన్ రవితో విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు స్వయంప్రతిపత్తి కోసం చర్యలను సిఫార్సు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. రాష్ట్ర హక్కులను కేంద్రం క్రమంగా లాక్కుంటోందని ఆరోపించారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ రాష్ట్ర స్వయంప్రతిపత్తిని నిర్ధారిస్తుంది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాన్ని వివరంగా పరిశీలిస్తుంది. జనవరి 2026లో తన మధ్యంతర నివేదికను సమర్పిస్తుంది. ఈ కమిటీలో మాజీ ఐఏఎస్ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఎం. నాగనాథన్ సభ్యులుగా ఉంటారు. సిఫార్సులతో కూడిన తుది నివేదికను ఈ కమిటీ రెండేళ్లలో సమర్పించనున్నట్లు స్టాలిన్ తెలిపారు.
'నీట్ పరీక్షను వ్యతిరేకిస్తుంటాం'
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ కమిటీ పరిశోధన చేసి సిఫార్సులు చేస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు. అలాగే నీట్ పరీక్ష, త్రిభాషా విధానంపై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు. నీట్ కారణంగా చాలా మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. నీట్ పరీక్షను నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంటామని తెలిపారు.
త్రిభాషా విధానంపై విమర్శలు
త్రిభాషా విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం తమపై హిందీని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని స్టాలిన్ ఆరోపించారు. తమిళనాడు సర్కార్ జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించినందున, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన రూ. 2500 కోట్లు నిధులను ఆపేసిందని విమర్శించారు. విద్యను ఉమ్మడి జాబితాకు మార్చడానికి అనుమతించే 42వ రాజ్యాంగ సవరణను రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర జాబితాలో విద్య ఉండాలని డిమాండ్ చేశారు.
గవర్నర్ వర్సెస్ తమిళనాడు సర్కార్
బిల్లుల ఆమోదంపై గవర్నర్, తమిళనాడు ప్రభుత్వం మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో స్టాలిన్ సర్కార్కు ఉపశమనం లభించింది. పెండింగులో పెట్టిన పది బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టే భావించాలని న్యాయస్థానం స్పష్టం చేసిన నేపథ్యంలో వాటికి చట్టబద్ధమైన హోదా కల్పిస్తూ ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేసింది. ఈ పరిణామాల వేళ రాష్ట్ర స్వయంప్రతిపత్తిపై సూచనలకు కమిటీని ఏర్పాటు చేస్తూ స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.