Pakistan Spy Youtuber Jyoti Malhotra : పాకిస్థాన్కు గూఢచారిగా వ్యవహరించిందన్న ఆరోపణలపై అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత రెండేళ్లలో దేశంలోని ప్రముఖ దేవాలయాలను జ్యోతి సందర్శించి, వీడియోలను తీసింది. ఈ క్రమంలో భారత్లోని హిందూ ఆలయాల గురించి పాక్ ఏమైనా సమాచారం ఇచ్చిందా? గుడులపై దాడులకు ఏమైనా కుట్ర చేయించిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కోణంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.
అజైబినాథ్ ఆలయం సందర్శన
రెండేళ్ల క్రితం (2023) జ్యోతి బిహార్ సుల్తాన్గంజ్లో రెండు రోజులు బస చేసింది. శ్రావణ మాసంలో అజైబినాథ్ ఆలయం, దాని సమీపంలోని అన్ని ప్రసిద్ధ ప్రదేశాలను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. ఆ సమయంలో నాథ్ నగర్కు చెందిన ఒక యూట్యూబర్ ఆమెకు సాయం చేశాడు. అజైబినాథ్ ధామ్ సమీపంలోని పెద్ద మసీదుకు కూడా జ్యోతి వెళ్లినట్లు తెలుస్తోంది. జ్యోతి ఆలయ సందర్శనలో ఏమైనా కుట్రకోణం దాగి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. జ్యోతి సందర్శించిన మతపరమైన ప్రదేశాల్లో తనిఖీలు చేపడుతున్నారు. అలాగే జ్యోతితో పరిచయం ఉన్న యూట్యూబర్ పైనా పోలీసులు నిఘా పెట్టారు.


"అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. అజైబినాథ్ ఆలయ భద్రతను కూడా పెంచాం. ఆలయ ప్రాంగణంలో సీసీటీవీలను పరిశీలిస్తున్నాం. జ్యోతి మల్హోత్రా భాగల్పుర్ పర్యటన సందర్భంగా కలిసిన వారందరినీ విచారిస్తున్నాం. నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తాం"
--హృదయకాంత్, భాగల్పుర్ ఎస్పీ

ఉజ్జయినిని సందర్శించిన జ్యోతి
పాకిస్థాన్ స్పై జ్యోతి మల్హోత్రా ఏడాది క్రితం హిసార్ నుంచి ఉజ్జయినికి రైలులో, ఇందౌర్ నుంచి దిల్లీకి బస్సులో ప్రయాణించింది. ఈ ప్రయాణ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ "ట్రావెల్ విత్ జో" అప్ లోడ్ చేసింది. వీడియోలో జ్యోతి మల్హోత్రా ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిర్లింగ బాబా మహాకాళేశ్వర్ ఆలయం క్లిప్ను కూడా చూపించింది. ఇందులో ఆలయ ప్రధాన ద్వారం, గర్భగుడి కనిపించాయి. దీంతో మహాకాళేశ్వర్ ఆలయంలో భద్రతా ఏర్పాట్ల గురించి ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
"జ్యోతి మల్హోత్రా ఏడాది క్రితం ఉజ్జయినికి వచ్చినట్లు సమాచారం అందింది. ఈ కేసు దర్యాప్తునకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశాం. ఆ బృందం జ్యోతిని విచారించడానికి బయలుదేరుతోంది. ఆమె ఉజ్జయిని వచ్చి ఎవరిని కలిసింది. ఎక్కడికి వెళ్లిందో తెలుసుకుంటాం. భక్తులు ఎటువంటి భయాలు లేకుండా ఉజ్జయినికి రావాలి. వారి భద్రత మా బాధ్యత. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం." అని ఉజ్జయిని ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపారు.
కేదారినాథ్, గంగోత్రి, బద్రీనాథ్ సందర్శన
అలాగే ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్, గంగోత్రి, బద్రీనాథ్, దెహ్రాదూన్, హరిద్వార్, రిషికేశ్ సహా వివిధ ప్రదేశాలను సందర్శించిన వీడియోను జ్యోతి యూట్యూబ్ లో పెట్టింది. కేదార్నాథ్ ధామ్ ఏర్పాట్ల గురించి ఆ వీడియోలో సమాచారం అందించింది. ఆహారం, వసతి గురించి వివరించింది. దెహ్రాదూన్ నుంచి నేపాల్ కు కూడా ప్రయాణించింది. ఈ రెండు ప్రదేశాల మధ్య నడుస్తున్న మైత్రి బస్సు సర్వీస్ గురించి ఆమె ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
బోర్డర్లో వీడియో
భారత్- పాక్ సరిహద్దు ప్రాంతమైన రాజస్థాన్లోని బాడ్మేర్లోనూ ఏడాదిన్నర క్రితం జ్యోతి ఓ వీడియోను చేసింది. బాడ్మేర్ నుంచి మునాబావో వరకు రైలులో ప్రయాణించింది. సరిహద్దు ప్రాంతంలోని ఒక కుగ్రామంలో ఒక రాత్రి బస చేయడం గురించి పలు అనుమానాలు కలుగుతున్నాయి. బయటి వ్యక్తులు సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించడానికి, వీడియోలను తీయడానికి అధికారులు అనుమతి పొందాలి. మరీ జ్యోతి సరిహద్దు ప్రాంతానికి ఎలా చేరుకుంది? వీడియో చేయడానికి సరిహద్దు పోలీసు స్టేషన్ల నుంచి అనుమతి తీసుకుందా? పర్మిషన్ లేకుండా వ్లాగింగ్ వీడియోను చిత్రీకరించిందా? అనే అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


రక్షణ స్థావరాల వీడియోలు తీసిన పాక్ 'స్పై' జ్యోతి- వెలుగులోకి విస్తుపోయే విషయాలు!
'జ్యోతి మల్హోత్రాను అస్త్రంగా మార్చుకున్న ISI- పాక్కు ఎన్నోసార్లు!'
యూట్యూబర్ విచారణలో విస్తుపోయే విషయాలు- పాక్ కోసం ఆమె ఎలా గూఢచర్యం చేసిందంటే?