Delhi HC On Ramdev Baba : షర్బత్ జిహాద్ అంటూ యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై దిల్లీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది కోర్టు అంతర్మాత్మను షాక్కు గురి చేసిందని, ఇలాంటి వ్యాఖ్యలు ఎంత మాత్రం సమర్థనీయం కాదని న్యాయస్థానం పేర్కొంది. రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్కు వ్యతిరేకంగా హమ్దార్ద్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
ఇదీ జరిగింది
ఏప్రిల్ 3న బాబా రాందేవ్ బాబా పతంజలి గులాబ్ షర్బత్ను ప్రమోట్ చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో హమ్దార్ద్ షర్బత్ గురించి రామ్దేవ్ బాబా పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేశారు. 'ఓ కంపెనీ షర్బత్ అమ్ముతుంది. కానీ దాని ద్వారా సంపాదించిన డబ్బును మసీదులు, మదర్సాలు నిర్మించడానికి వినియోగిస్తున్నారు. అదే పతంజలి తయారు చేసే గులాబ్ షర్బత్ తాగితే గురుకులాలు, ఆచార్యకులం, పతంజలి యూనివర్సిటీ నిర్మాణాలు, భారతీయ విద్యా మండలి అభివృద్ధి జరుగుతుంది. సాఫ్ట్ డ్రింక్స్ పేరుతో టాయిలెట్ క్లీనర్లను అమ్ముతున్నారు. వీటి నుంచి మీ పిల్లలను కాపాడుకోవాలి' అని వ్యాఖ్యలు చేస్తూ షర్బత్ జిహాద్ పేరుతో రాందేవ్ బాబా వీడియో రిలీజ్ చేశారు.
రాందేవ్ బాబా చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే హమ్దార్ద్ కంపెనీ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వెంటనే ఆ వీడియోను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. హమ్దార్ద్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇది ఆ సంస్థ ఉత్పత్తిని అగౌరవపరచడం కంటే తీవ్రమైందని, అవి ద్వేషపూరిత వ్యాఖ్యల కిందికే వస్తాయని వాదించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, ఈ వ్యాఖ్యలు కోర్టు అంతరాత్మను షాక్కు చేశాయంటూ తీవ్రంగా స్పందించింది. ఆ తర్వాత వివాస్పదమైన వీడియోలు అన్నీ తొలగిస్తామని కోర్టుకు రాందేవ్ బాబా తరఫున న్యాయవాది తెలిపారు.