Congress Upset With Shahshi Tharoor : కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్పై పార్టీ అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ అధినాయకత్వంతో బంధం బీటలు వారుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న ఈ క్రమంలో- సొంత పార్టీలోనే ఆయన వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఇటీవల భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో వరుస వ్యాఖ్యానాలు చేశారు శశిథరూర్. దీంతో ఆయన లక్ష్మణ రేఖ దాటారని పార్టీ వర్గాలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, శశిథరూర్, ప్రియాంక గాంధీ, సచిన్ పైలట్ సహా మరికొంత మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు బుధవారం దిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం పార్టీ వర్గాలు శశిథరూర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాయి. కాంగ్రెస్ ఓ ప్రజాస్వామ్య పార్టీ అని, ఇందులో నేతలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తారని వెల్లడించాయి. అయికే, శశిథరూర్ మాత్రం ఈసారి లక్ష్మణ రేఖ దాటారని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే వ్యక్తిగత అభిప్రాయాల వెల్లడికి ఇది సమయం కాదని, పార్టీ వైఖరికి కట్టుబడి ఉండాలని తాజా సమావేశంలో అధిష్ఠానం సైతం ఎవరి పేరు ఎత్తకుండానే స్పష్టం చేసిందని అని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ వ్యవహారంపై జైరాం రమేశ్ సైతం స్పందించారు. శశిథరూర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలన్నారు. వాటికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కాగా, శశి థరూర్ మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు.
'మోదీ సమర్థుడు'
ఇదిలా ఉండగా, భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సమర్థంగా వ్యవహరించారంటూ ఇటీవల శశిథరూర్ కొనియాడారు. ఉగ్రవాదం విషయంలో దాయాది దేశానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని ప్రసంశించారు.
శశిథరూర్ నాతో ఉండడం కొందరికి నిద్రలేని రాత్రి : ప్రధాని మోదీ
ఇటీవల కేరళలో రూ. 8,867 కోట్లతో నిర్మించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రధాని ప్రారంభించారు. ఈ క్రమంలోనే మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష పార్టీపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ ఫొటో చాలామందికి నిద్రలేకుండా చేస్తుందని కాంగ్రెస్ను ఉద్దేశించి శశిథరూర్, విజయన్ ముందే ప్రధాని వ్యాఖ్యానించారు. "ఈ రోజు శశి థరూర్ ఇక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమం కొందమందికి నిద్రలేని రాత్రిని మిగులుస్తుంది. మసేజ్ ఎక్కడి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోయింది" అని మోదీ చురుకు అంటించారు.
ఆపరేషన్ సిందూర్ను రాజకీయం చేస్తున్న బీజేపీ- సమాధానాల కోసం జైహింద్ ర్యాలీలు : కాంగ్రెస్
మహిళలు రఫేల్ నడుపుతున్నారుగా- మరి ఆ పోస్ట్లు ఎందుకివ్వరు?- కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న