ETV Bharat / bharat

ఉత్తర కాశీలో క్లౌడ్‌ బరస్ట్‌- ఇద్దరు మృతి, ఏడుగురు గల్లంతు- చార్‌ధామ్‌ యాత్ర 24 గంటల పాటు నిలిపివేత!

ఉత్తర కాశీ జిల్లాలో క్లౌడ్‌ బరస్ట్‌

Cloudburst In Uttarakhand
Cloudburst In Uttarakhand (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 29, 2025 at 7:45 AM IST

|

Updated : June 29, 2025 at 9:02 AM IST

2 Min Read
Choose ETV Bharat

Cloud Burst In Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లాలో సంభవించిన అకస్మిక వరదల కారణంగా ఓ హోటల్‌ కుప్పకూలింది. దీంతో అక్కడే పనిచేస్తున్న 9మంది కార్మికులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు వెలికితీయగా, మరో ఏడుగురి కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు భారీ వర్షాలు కారణంగా చార్​ధామ్​ యాత్రను 24 గంటల పాటు నిలిపివేశారు.

అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, శనివారం బార్‌కోట్‌-యమునోత్రి మార్గంలోని సిలాయ్‌ బాంద్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఆకస్మిక వరదలు కూడా సంభవించాయి. దీంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్‌ ధ్వంసం కావడం వల్ల అక్కడే పనిచేస్తున్న 9మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వారిలో ఎస్​డీఆర్‌ఎఫ్‌, ఎన్​డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయి. గల్లంతైన కార్మికులు నేపాల్‌ పౌరులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కార్మికులు గుడారాల్లో ఉన్నారని అధికారులు తెలిపారు. హోటల్‌ నిర్మాణం కోసం వచ్చిన కార్మికులకు యజమాని సమీపంలోనే క్యాంపును ఏర్పాటు చేశారని వెల్లడించారు.

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో తాను నిరంతరం సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనవసరమైన ప్రయాణాలు చెయొద్దు అని తెలిపారు.

శనివారం కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ అంతటా తీవ్ర అంతరాయం ఏర్పడింది. నందప్రయాగ్, భానేర్పాని సమీపంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా, భారత వాతావరణ శాఖ రెడ్​ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతంలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

మరోవైపు భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో చార్ ధామ్ యాత్రను రాబోయే 24 గంటలు నిలిపివేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు గఢ్​​వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, వికాస్‌నగర్‌లలో యాత్రికులను ఆపాలని పోలీసులకు, ఉన్నతాధికారలకు సూచించినట్లు తెలిపారు. సోమవారం వాతావరణ పరిస్థితులను సమీక్షించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Last Updated : June 29, 2025 at 9:02 AM IST