Pahalgam Terror Attack Ex Gratia : మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన రాష్ట్ర పౌరులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఆరుగురు మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మంగళవారం వెల్లడించారు. దీంతో పాటు వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వనున్నట్లు వివరించారు. మంగళవారం మహారాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
వీటికి కూడా కేబినెట్ ఆమోదం
హడాస్పుర్ నుంచి యావత్ మధ్య రాష్ట్ర రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపింది. షిప్ యార్డ్, షిప్ రీసైక్లింగ్ అభివృద్ధి పనులకు ఓకే చెప్పింది. మహారాష్ట్ర ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ 2025ని ఆమోదించింది. యాప్ ఆధారంగా నడిచే వాహనాలకు ఆగ్రిగేటర్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ముల్షీ జిల్లాలోని తెగ్మర్ ప్రాజెక్ట్ రివైజ్డ్ అంచనాలను రూ.488.53 కోట్లకు పెంచేందుకు అంగీకరించింది. పీఎం యశస్వీ పథకం కింద ఇచ్చే ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ స్కాలర్షిప్ల సవరించిన మార్గదర్శకాలను అమలు చేసేందుకు ఓకే చెప్పింది. ఓబీసీలకు ఇచ్చే రుణాల పరిధిని రూ. 10లక్షల నుంచి 15 లక్షలకు పెంచేందుకు అంగీకరించింది. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించింది. రైతుల కోసం సమగ్ర పంటల బీమా పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మృతుల్లో మహారాష్ట్ర వారే ఎక్కువ
జమ్ము కశ్మీర్ పహల్గాంలో మినీ స్విట్జర్లాండ్గా పిలిచే బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యటకులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ముష్కరులు అతి సమీపం నుంచి పర్యటకులపైన కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐఏఎఫ్ కార్పోరల్, నేవీ, ఎక్సైజ్ అధికారి కూడా మరణించారు. అయితే మృతుల్లో ఎక్కువ మంది (ఆరుగురు) మహారాష్ట్రకు చెందిన పర్యాటకులు ఉన్నారు. ముంబయికి చెందిన దిలీప్ దేసాలే, హేమంత్ జోషి సుహాస్, థానేకు చెందిన అతుల్ శ్రీకాంత్ మోని, సంజయ్ లక్ష్మణ్ లేలే, పుణెకు చెందిన సంతోష్ జగ్దాలే, కస్టోబే గనోవోటే మరణించారు.
జమ్ముకశ్మీర్లో 48పర్యటక ప్రాంతాల మూసివేత- ఉగ్రదాడులు జరగొచ్చని వార్నింగ్
ఉగ్రదాడి సాకుతో జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా అడగను- ఒమర్ అబ్దుల్లా భావోద్వేగం