Man Reunited With Family After 29 Years : తొమ్మిదేళ్ల వయసులో తప్పిపోయిన బాలుడు గూగుల్ మ్యాప్స్ సాయంతో 38 ఏళ్ల ఏజ్లో తన ఇంటికి చేరుకున్నాడు. 29 ఏళ్ల సుదీర్ఘ వ్యవధి తర్వాత కన్నవారి చెంతకు చేరాడు. ఈ ఘటన హరియాణాలోని అంబాలాలో జరిగింది.
అసలేం జరిగిందంటే?
అంబాలా కాంట్లోని కబీర్ నగర్కు చెందిన సంజయ్ తొమ్మిదేళ్ల వయసులో తన ఇంటి నుంచి ఆలయానికి బయలుదేరాడు. ఆ తర్వాత ఆడుకుంటూ అంబాలా కాంట్ రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడ సరదాగా రైలు ఎక్కి నిద్రలోకి జారుకున్నాడు. నిద్రమేల్కొని చూసేసరికి రైలు ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రాకు చేరుకుంది. అయితే ఆ సమయంలో సంజయ్కు తన ఇంటి అడ్రస్ గుర్తుకు రాలేదు. దీంతో ఎటూ వెళ్లలేక అక్కడే ఉండిపోయాడు.

సంజయ్కు ఆశ్రయమిచ్చిన దాబా యజమాని
ఈ క్రమంలోనే ఆగ్రాలోని ఓ దాబా యజమాని ఇంద్రజిత్, అతని భార్య గీత తప్పిపోయిన బాలుడు సంజయ్కు ఆశ్రయం కల్పించారు. అప్పటికి ఇంద్రజిత్కు పిల్లలు లేకపోవడంతో వారితోనే కలిసి సంజయ్ నివసించేవాడు. ఆ తర్వాత దాబా యజమాని ముగ్గురు పిల్లలు పుట్టారు. అలాగే 2002లో మేరఠ్కు మకాం మార్చారు. అక్కడి నుంచి 2004లో రిషికేశ్కు మారారు. అనంతరం 2009లో ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాధికను సంజయ్ వివాహమాడాడు. వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు.

గూగుల్ మ్యాప్స్ సాయంతో
అయితే, ఒకరోజు సంజయ్కు అంబాలాలోని తన ఇంటి దగ్గర ఒక పోలీస్ పోస్ట్, దాని ముందు ఒక దర్గా ఉందని గుర్తుకొచ్చింది. దాని కోసం గూగుల్లో వెతకడం ప్రారంభించాడు. గూగుల్ మ్యాప్స్ ద్వారా తన స్వగ్రామంలోని తన ఇంటిని గుర్తించాడు. గ్రామానికి వెళ్లి తన ఇంటిని వెతుకుతున్న సమయంలోనే వీణ అనే మహిళ ఎవరి కోసం వెతుకుతున్నావని సంజయ్ను అడిగింది. అప్పుడు తన తండ్రి పేరు కరం పాల్ అని, తల్లి పేరు వీణ అని ఆమెకు సంజయ్ చెప్పాడు. చిన్న వయసులోనే ఇంటి నుంచి తప్పిపోయానని చెప్పాడు. అయితే వీణ అతని మాటలను నమ్మలేదు. సంజయ్ మొబైల్ నంబర్ తీసుకుంది. దీంతో అక్కడి నుంచి సంజయ్ వెళ్లిపోయాడు.

చిన్ననాటి విషయాలు చెప్పిన సంజయ్
ఇటీవలే సంజయ్కు వీణ ఫోన్ చేసి అంబాలా రమ్మని కోరింది. అక్కడికి వచ్చిన తర్వాత వీణ, ఆమె పిల్లలు సంజయ్కు తన బాల్యం గురించి కొన్ని జ్ఞాపకాలను అడిగారు. అతను ప్రతిదీ సరిగ్గా చెప్పాడు. దీంతో 29 ఏళ్ల తర్వాత తప్పిపోయిన తమ కుమారుడే సంజయ్ అని నమ్మి సంతోషపడ్డారు. "సంజయ్ కనిపించకుండా పోయిన తర్వాత, మహేశ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. కానీ అతని ఆచూకీ లభించలేదు. ఇప్పుడు సంజయ్ తిరిగి వచ్చాడు. చాలా ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా సంజయ్ ఇంటికి రావడం కలా నిజమా ఆర్థం కావడం లేదు." అని సంజయ్ తల్లి వీణ చెప్పారు.

సోదరుడి రాకపై సోదరి హర్షం
మరోవైపు సంజయ్ సోదరి రజని సైతం సోదరుడి రాకపై సంతోషం వ్యక్తం చేసింది. సంజయ్ కనిపించకుండా పోయినప్పటి నుంచి తాను అతడి ఫొటోకు రాఖీ కట్టేదానినని చెప్పింది. సంజయ్ తిరిగి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. తన సోదరుడు ఏదో ఒక రోజు ఇంటికి తిరిగి వస్తాడని తనకు తెలుసని వ్యాఖ్యానించింది.

'ఫలించిన సుదీర్ఘ పోరాటం'
సంజయ్ సుదీర్ఘ పోరాటం తర్వాత చివరకు తన కుటుంబాన్ని కలిశాడని అతడి భార్య రాధిక చెప్పింది. అందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. రిషికేశ్ లోని ఒక ఫ్యాక్టరీలో సంజయ్ను తాను కలిశానని, ఆ తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకున్నామని పేర్కొంది.
'మీలాంటి అధికారి మళ్లీ రారు'- ఇన్స్పెక్టర్ బదిలీపై వెళ్తుంటే వెక్కి వెక్కి ఏడ్చిన ప్రజలు
ట్విన్ సిస్టర్స్ అదుర్స్- రూపంలోనే కాదు మార్కుల్లోనూ సేమ్ టూ సేమ్