Complaint On Urvashi Rautela : బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ఓ ఇంటర్వ్యూలో తన పేరుపై ఉన్న ఆలయం గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై ఇప్పటికే బద్రినాథ్ సమీపంలోని ఆలయాల అర్చకులు మండిపడ్డారు. నటి ఊర్వశీ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. బద్రినాథ్ సమీపంలోని బామ్నిలో ఊర్వశీ పేరుతో ఆలయం ఉన్న మాట వాస్తవమేనని, అయితే, ఆ ఆలయానికీ నటికి సంబంధం లేదని తెలిపారు.
ఇప్పుడు కొందరు పూజారులు ఉత్తరాఖండ్ డీజీపీ కలిసి ఊర్వశీపై ఫిర్యాదు చేశారు. లేఖను సమర్పించి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ చార్ధామ్ తీర్థ పురోహిత్ మహాపంచాయత్, బ్రహ్మ కపాల్ తీర్థ పురోహిత్ పంచాయతీ సమితి ప్రతినిధుల బృందం శనివారం డీజీపీ దీపం సేఠ్ను కలిశారు. ఊర్వశీ రౌతేలాతోపాటు సంబంధిత యూట్యూబ్ ఛానల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"నటి ఊర్వశి రౌతేలా ఖండించదగిన ప్రకటన చేశారు. అందులో బద్రీనాథ్ ధామ్ సమీపంలో తన పేరు మీద ఒక ఆలయం ఉందని అన్నారు. ఇది సనాతన సంప్రదాయానికి, ఛార్ధామ్కు అవమానం. అందుకే డీజీపీని కలిసి ఊర్వశీ రౌతేలాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం. చార్ధామ్తోపాటు తీర్థయాత్ర పూజారులకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఊర్వశి ఎక్కడికి వెళ్ళినా, పూజారులు ఆమెకు వ్యతిరేకంగా నల్ల బ్యాండ్లు కట్టి నిరసన తెలుపుతారు"
- ఉమేశ్ సథీ, కేంద్ర అధ్యక్షుడు, బ్రహ్మ కపాల తీర్థ అర్చక పంచాయతీ కమిటీ
మరోవైపు, ఊర్వశీ టీమ్ సోషల్ మీడయియాలో స్పందించింది. ఆమె వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంది. ఈమేరకు ఇన్స్టాలో పోస్ట్లో వివరణ ఇచ్చింది. "ఊర్వశీ ఆ వీడియోలో మాట్లాడుతూ తన పేరు మీద ఆలయం ఉందని చెప్పారు. అది తన ఆలయం అని చెప్పలేదు. అందరూ ఆమె వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. దయచేసి వీడియో మరోసారి విని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ల్లీ యూనివర్సిటీలో నిజంగానే ఆమె ఫొటోకు దండలు వేసి పూజిస్తారు. దీనిపై గతంలోనూ కథనాలు వచ్చాయి. అవి ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. నిరాధారమైన ఆరోపణలు, అవమానకరమైన వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలి. ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. వారి మాటలను సరిగ్గా అర్థం చేసుకోవాలి" అని టీమ్ పేర్కొంది. పురాణాలు, స్థానికుల నమ్మకం ప్రకారం శ్రీమహావిష్ణువు తొడ నుంచి ఉద్భవించడం లేదా సతీదేవి శరీర భాగం పడిన ప్రదేశం ఊర్వశీ దేవి ఆలయంగా మారిందని చెబుతారు.