PM Modi Raisina Dialogue 2025 : భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 'రైసినా డైలాగ్' సదస్సును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం దిల్లీలో ప్రారంభించనున్నారు. దీనిలో 125 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును భారత విదేశాంగ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) నిర్వహిస్తోంది. ప్రపంచ రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చకు వేదికగా రైసినా డైలాగ్ సదస్సు నిలువనుంది. 'కాల చక్ర - ప్రజలు, శాంతి, భూగ్రహం' అనే థీమ్తో ఈసారి సదస్సును నిర్వహిస్తున్నారు. పదోసారి జరగబోతున్న ఈ సదస్సులో పాల్గొనే ప్రముఖుల జాబితాలో న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సాన్, అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబార్డ్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహా తదితరులు ఉన్నారు. ఈ సదస్సులో న్యూజిలాండ్ ప్రధాని కీలకోపన్యాసం చేయనున్నారు. రష్యా - ఉక్రెయిన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ తరుణంలో భారత్కు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి వస్తుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
తైవాన్ నుంచి సైతం
మునుపెన్నడూ లేని రీతిలో భారత్-తైవాన్ సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఈక్రమంలో తైవాన్కు చెందిన ఓ సీనియర్ భద్రతా అధికారి సారథ్యంలోని టీమ్ కూడా 'రైసినా డైలాగ్' సదస్సుకు విచ్చేయనుంది. 125 దేశాలకు చెందిన మంత్రులు, మాజీ ప్రభుత్వాధినేతలు, మిలిటరీ కమాండర్లు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, విదేశాంగ వ్యవహారాల పరిశీలకులు సహా దాదాపు 3,500 మందికిపైగా ఇందులో పాల్గొని కీలక అంశాలను చర్చించబోతున్నారు. దాదాపు 20 దేశాల విదేశాంగ మంత్రులు 'రైసినా డైలాగ్'లో పాల్గొంటారని సమాచారం. స్లొవేనియా, లగ్జంబర్గ్, లీచ్ టెన్స్టీన్, లాత్వియా, మాల్దోవా, జార్జియా, స్వీడన్, స్లోవక్ రిపబ్లిక్, భూటాన్, మాల్దీవ్స్, నార్వే, థాయ్లాండ్, ఆంటిగ్వా, బార్బుడా, పెరూ, ఘనా, హంగరీ, మారిషస్ దేశాల విదేశాంగ మంత్రులు సదస్సుకు హాజరు కానున్నారు. క్యూబా డిప్యూటీ ప్రధానమంత్రి మార్టినెజ్ డియాజ్, ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖ మంత్రి ఎన్రిక్ ఎ.మనాలో సైతం దిల్లీకి వస్తున్నారు.
ఈ ఆరు అంశాలపై ప్రధాన చర్చ
- 'రైసినా డైలాగ్' సదస్సులో ప్రధానంగా 6 అంశాలపై మూడు రోజుల పాటు సమగ్రంగా చర్చించనున్నారు.
- అంతర్జాతీయ సమాజంలో రాజకీయ అవాంతరాలు, సవాళ్లపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ మార్పులను ఎలా తట్టుకోవాలనే దానిపై చర్చ జరగనుంది.
- ఆర్థిక, వాణిజ్య, రాజకీయపరమైన వ్యవహారాల్లో ప్రతిష్ఠంభన తొలగాలంటే, ఎవరు? ఎక్కడ? ఎలా? అనే మూడు అంశాలపై ప్రపంచ దేశాలు స్పష్టతకు రావాలి. ఈ దిశగా చర్చలు జరగనున్నాయి.
- ఇది డిజిటల్ యుగం. ప్రపంచ దేశాల నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు, వాటి ఉన్నతాధికారులు డిజిటల్గా సమన్వయం చేసుకునేలా వ్యవస్థల ఏర్పాటుపై చర్చ జరగనుంది.
- ఉగ్రవాదం కట్టడిపై చర్చించనున్నారు. దీనిపై కలిసికట్టుగా పనిచేసేందుకు సరైన వ్యూహాలను సిద్ధం చేయనున్నారు.
- ప్రగతి పయనంలో కలిసికట్టుగా నడవాలనే భావనపై వివిధ దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు. ఇందుకోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.
- ప్రపంచ శాంతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. ఇందుకు దోహదపడే సంస్థలు, ప్రతినిధులకు ప్రోత్సాహం, వారిని సమన్వయం చేయడంపై దృష్టి పెడతారు.