PM Modi Is Fooling People : జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'ప్రజలను మోసగిస్తున్నారు' అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.
"పహల్గాం ఉగ్రదాడి తరువాత కేంద్రం అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. కానీ ఆ సమావేశానికి ప్రధానమంత్రి మోదీ హాజరు కాలేదు. ఆ సమయంలో ఆయన బిహార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. దీనిని బట్టి ఆయనకు ఏది ముఖ్యమో తెలిసిపోతోంది. 'మోదీ ప్రజలకు టోపీ పెడుతున్నారు'. అంటే ప్రజలను మోదీ మోసం చేస్తున్నారు"
- సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి
మనకు యుద్ధం వద్దు!
జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై భారతదేశం స్పందన ఎలా ఉండాలని విలేకరులు ప్రశ్నించగా, "యుద్ధం అవసరం లేదు. మేము పాకిస్థాన్తో యుద్ధానికి అనుకూలంగా లేము. మనం కఠిన చర్యలు తీసుకోవాలి. భద్రతను కట్టుదిట్టం చేయాలి. దేశంలో శాంతి నెలకొనాలి. ప్రజలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి. ఇందుకోసం కేంద్రం భద్రతా చర్యలు తీసుకోవాలి" అని సిద్ధరామయ్య అన్నారు. అక్కడితో ఆగకుండా, పహల్గామ్ ఉగ్రదాడి కేవలం భద్రతా వైఫల్యం వల్ల మాత్రమే జరిగిందని ఆయన పునరుద్ఘాటించారు.
కేంద్రం చెప్పినట్లే చేస్తాం!
పాకిస్థాన్ పౌరులను దేశం నుంచి పంపించేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దానిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు, "మేము కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తాం. మేము పాక్ జాతీయులను తిరిగి పంపిస్తాం. దాని గురించి కేంద్రానికి కూడా తెలియజేస్తాం. ప్రస్తుతానికి కర్ణాటకలో నివసిస్తున్న పాకిస్థాన్ పౌరుల సంఖ్య గురించి మాకు సమాచారం లేదు" అని సిద్ధరామయ్య చెప్పారు.
కర్ణాటకలో పాకిస్థానీ పౌరులు ఎక్కువగా ప్రధాన నగరాల్లో నివసిస్తున్నారు. అయితే మిగతా నగరాలతో పోల్చితే బెంగళూరులోనే పాక్ జాతీయులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
2025 ఏప్రిల్ 22 మధ్యాహ్నం వేళ కశ్మీర్లోని పహల్గామ్ పట్టణానికి సమీపంలోని ఒక పర్యాటక ప్రదేశంలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. హిందూ పురుషులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
భారత్లో అక్రమంగా 550మంది బంగ్లా వలసదారులు- స్పెషల్ ఆపరేషన్లో అరెస్ట్
'సింధూలో రక్తం పారుతుంది'- తట్టుకోలేక భారత్పై పాక్ మంత్రుల అక్కసు