PM Modi on Armed Froces : పాకిస్థాన్ బుల్లెట్లకు ఫిరంగులతో సమాధానం ఇవ్వాలని భారత సైన్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. పాకిస్థాన్ ప్రతీ చర్యకు భారత్ నుంచి బలమైన ప్రతిస్పందన ఉండాలని సాయుధ దళాలకు సూచించారు. కశ్మీర్ విషయంలో భారత్కు చాలా స్పష్టమైన వైఖరి ఉందని మోదీ వెల్లడించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను భారత్కు అప్పగించడం మినహా కశ్మీర్ అంశంలో పాక్తో ఎలాంటి చర్చలు ఉండవని వెల్లడించాయి. కశ్మీర్ అంశంలో ఎవరి మధ్యవర్తిత్వమూ అవసరం లేదని తేల్చి చెప్పాయి. అంతే కాకుండా పాకిస్థాన్పై దాడి చేస్తామని ముందే అమెరికాకు భారత్ చెప్పినట్లు పేర్కొన్నాయి.
అమెరికాకు ముందే సమాచారమిచ్చిన జైశంకర్
పాకిస్థాన్లోని ఉగ్రవాదులపై దాడి చేసి తీరుతామని, దానిపై ఎలాంటి సందేహమూ అక్కర్లేదని మే 1న అమెరికా విదేశాంగ మార్కో రూబియోకు భారత విదేశాంగ మంత్రి జై శంకర్ చెప్పినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. 'ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులతో పాకిస్తాన్కు ఉన్న లింకులపై సరికొత్త ఆధారాలతో ఒక టీమ్ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి భారత్ పంపనుంది. వచ్చే వారం యూఎన్ఎస్సీఆర్ 1267 ఆంక్షల కమిటీ సమావేశమై ఈ ఆధారాలను పరిశీలించనుంది' అని భారత ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.
దాడుల తర్వాత దారికొచ్చిన పాక్
భారత సైనిక వర్గాల కథనం ప్రకారం మే 9న రాత్రి, మే 10న తెల్లవారుజామున పాకిస్థాన్లోని సైనిక స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. అనంతరం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రంగంలోకి దిగి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు కాల్ చేసి మాట్లాడారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు రూబియో ఫోన్ చేశారు. భారత్తో చర్చలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని జైశంకర్కు రూబియో సమాచారం ఇచ్చారు. కేవలం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)ల స్థాయిలో చర్చలు జరుగుతాయని భారత్ స్పష్టం చేసింది. తదుపరిగా మే 10న మధ్యాహ్నం 1 గంటలకు ఫోన్ కాల్ చేయడానికి భారత డీజీఎంఓను పాకిస్థాన్ డీజీఎంఓ అపాయింట్మెంట్ కోరారు. తదుపరిగా ఇరుదేశాల డీజీఎంఓలు చర్చించుకొని కాల్పుల విరమణపై అంగీకారానికి వచ్చారు. వాస్తవానికి మే 7నే 'ఆపరేషన్ సిందూర్'ను పూర్తి చేశాక, పాక్ డీజీఎంఓకు భారత డీజీఎంఓ ఒక మెసేజ్ను పంపారు. అయితే ఆ రోజున పాక్ డీజీఎంఓ నుంచి స్పందన రాకపోవడం గమనార్హం.
పాకిస్థాన్పై మూడ్రోజుల సైనిక చర్య తర్వాత పరిస్థితులు సంపూర్ణంగా మారిపోయాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచం, పాకిస్థాన్ దీన్ని అంగీకరించాలని, పరిస్థితులు గతంలో మాదిరిగా ఉండవని తెలిపాయి. ఆపరేషన్ సిందూర్ సమాప్తం కాలేదని, సైనిక చర్య తర్వాత పరిస్థితులన్నీ కొత్తస్థాయికి చేరుకున్నాయని వెల్లడించాయి. ప్రధాన సైనిక స్థావరాలపై విజయవంతంగా దాడులు చేసి పాక్ మనోబలాన్ని దెబ్బతీశామని పేర్కొన్నాయి. వైమానిక స్థావరాలపై దాడులతో పాక్కు వాస్తవ పరిస్థితి అవగతమైందని, భారత్తో పోటీపడే పరిస్థితులు లేవన్న విషయం పాక్కు తెలిసొచ్చిందని వివరించాయి.
ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ISIకు భారత్ స్పష్టమైన సందేశం ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. భారత నిఘా నేత్రాల నుంచి పాకిస్థాన్ తప్పించుకోలేదని స్పష్టంచేసినట్టు పేర్కొన్నాయి. ఉగ్రవాద ప్రధాన స్థావరాలపై భారత్ కచ్చితమైన దాడులు చేసి చూపించిందని, చొరబాటుదారులు, బాధితుల మధ్య ఒకే వేదికపై చర్చలు సాధ్యం కాదని భారత్ ప్రపంచానికి చెప్పిందని వివరించాయి.