Supreme Court On Pegasus Case : దేశ వ్యతిరేక శక్తులపై ప్రభుత్వం స్పైవేర్ను వినియోగిస్తే తప్పేముందని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్ను కలిగి ఉండటం తప్పులేదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పెగాసస్ స్పైవేర్ను వినియోగించి దేశంలోని పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ N. కోటీశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.
స్పైవేర్ను ఉపయోగిస్తోందా లేదా అన్న విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని పిటిషన్ర్ తరఫున న్యాయవాది కోరారు. అంతేకాకుండా ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపి సాంకేతిక నిపుణుల బృందం నివేదిక కోసం సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఆదేశించిందని గుర్తుచేశారు. ఇప్పటివరకూ ఆ నివేదిక అందలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చిన పిటినషనర్ దాన్ని వెంటనే బహిర్గతం చేయాలని కోరారు. ఈ క్రమంలోనే దీనికి బదుల్చిన ధర్మాసనం ఓ దేశం స్పైవేర్ను వినియోగిస్తే గనుక అందులో తప్పేముందని వ్యాఖ్యానించింది. అయితే, దాన్ని ఎలా, ఎవరిపై ఉపయోగించారన్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
పౌర సమాజంపై కాకుండా దేశ వ్యతిరేక శక్తులపై దీన్ని వినియోగిస్తే గనుక అందులో ఏ తప్పు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దేశ భద్రత విషయంలో రాజీపడకూడదని, ఒకవేళ సామాన్య పౌరులపై ఉపయోగిస్తే గనుక దానిపై దర్యాప్తు జరిపిస్తామని చెప్పింది. దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన నివేదికను బహిర్గతం చేయడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం కేసు తదుపరి విచారణను జూలై 30కి వాయిదా వేసింది.
ఏంటీ పెగాసస్ దుమారం?
ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ అనే సంస్థ ‘పెగాసస్’ స్పైవేర్ని తయారు చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్ను ఎన్ఎస్వో పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ అధీనంలో పనిచేసే సంస్థలకు అమ్ముతుంటుంది. అయితే, ఈ పెగాసస్ను ఉపయోగించి పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేశారంటూ 2021లో ఓ అంతర్జాతీయ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత్ నుంచి రాజకీయ ప్రముఖులు సహా 300 మంది ఫోన్లు హ్యాక్ అయినట్లు పేర్కొంది. అయితే, ఈ వివాదం దేశ రాజకీయాలను కుదిపేయడంతో దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే పెగాసస్పై విచారణకు ఆదేశించిన సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించి నివేదికను రూపొందించింది.
OTT, సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్పై మీ స్పందన చెప్పండి-కేంద్రానికి సుప్రీం నోటీసులు
'ఆ పిటిషన్లంటిన్నీ కొట్టివేయాలి'- వక్ఫ్ చట్టంపై 1300 పేజీలతో సుప్రీంలో కేంద్రం అఫిడవిట్