Pak Terror Attacks on India : భారత్లో విదేశీ అతిథులు, అగ్రనేతలు పర్యటిస్తున్న సమయంలోనే ఉగ్రదాడులు జరుగుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది పాకిస్థాన్ కుట్రబుద్ధికి ఓ తార్కాణంలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి పహల్గాం ఉగ్రదాడికి, 2000 సంవత్సరంలో జరిగిన అనంత్నాగ్ ఛత్తీసింగ్పొర నరమేధానికి చాలా పోలికలు కనిపిస్తున్నాయి.
జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి పాక్ ఈ విధమైన నక్కజిత్తులు వేషాలు వేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండడం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటనలో ఉండడాన్ని అవకాశంగా తీసుకుని పాకిస్థాన్- పహల్గాం ఉగ్రదాడికి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.
క్లింటన్ పర్యటన సమయంలో
2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటనకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో, అంటే 2000 మార్చి 20న అనంత్నాగ్ జిల్లాలో ఛత్తీసింగ్పొరలో ఉగ్రవాదులు ఆకస్మిక దాడులు చేసి 36 మందిని బలి తీసుకున్నారు. నాడు సిక్కులే ముష్కర మూకలకు లక్ష్యంగా మారారు. జమ్ముకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే ఉద్దేశంతోనే పాక్ కుట్ర చేసింది.
నాడు ఉగ్రవాదులు రెండు సైనిక వాహనాల్లో, భారీ స్థాయిలో తుపాకులు తీసుకుని ఛత్తీసింగ్పొర గ్రామంలోకి చొరబడ్డారు. భారత సైనికుల వేషంలో ఇంటింటికీ వెళ్లి, తనిఖీల నిమిత్తం పురుషులు బయటకు రావాలని బెదిరించారు. అలా వచ్చిన పురుషులను గురుద్వారా వద్దకు తీసుకెళ్లి చంపేశారు. భారత సైన్యమే అలా చేసిందని, అక్కడి వారిని నమ్మించేలా ఉగ్రవాదులు నినాదాలు చేశారు. చివరికి దర్యాప్తులో పాక్ ఉగ్రవాదులే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు.
జేడీ వాన్స్ పర్యటన సందర్భంగా!
ఇప్పటి పహల్గాం ఉగ్రదాడికి, 2000లో జరిగిన ఛత్తీసింగ్పొర నరమేధానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్, తన కుటుంబంతో సహా భారత పర్యటనకు వచ్చారు. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. దీనితో జమ్మూకశ్మీర్ అంశాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజేయాలని పాక్ కుట్రపన్నినట్లు తెలుస్తోంది. అందుకే భారత సైనికుల్లా వేషాలు వేసుకున్న ఉగ్రవాదులు, కశ్మీర్లోని పర్యటకులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారు. మరీ ముఖ్యంగా పురుషులనే లక్ష్యంగా చేసుకున్నారు.
పాక్ సైన్యాధ్యక్షుడి ఆదేశాలతోనే దాడి?
పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆసీమ్ మునీర్ ఇటీవలే ఓవర్సీస్ పాకిస్థాన్ కన్వెన్షన్లో మాట్లాడుతూ, భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగం చేశారు.
"మన లక్ష్యం స్పష్టంగా ఉంది. గతంలో కశ్మీర్ మన గొంతులోని రక్తనాళంలా ఉండేది. ఇక భవిష్యత్తులోనూ అలానే ఉంటుంది. కశ్మీర్ను మనం ఎప్పటికీ మరిచిపోలేం. మన కశ్మీరీ సోదరులు పోరాటం చేస్తున్నారు. వారిని మనం ఒంటరిగా వదిలేయం. మీరు మీ పిల్లలకు పాకిస్థాన్ కథను కచ్చితంగా చెప్పండి. మన జీవితంలోని ప్రతి అంశం హిందువుల కంటే చాలా భిన్నమని మన పూర్వీకులు భావించారు. ఆ విషయాన్నే పిల్లలకు చెప్పండి. అప్పుడే మన పూర్వీకుల ఆలోచనలను పిల్లలు గుర్తుంచుకుంటారు. ఈ రెండు మతాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు పూర్తిగా భిన్నమైనవి. అదే ఈ రెండు దేశాల సిద్ధాంతానికి పునాది."
- ఆసీమ్ మునీర్, పాక్ ఆర్మీ చీఫ్
మునీర్ ఈ రెచ్చగొట్టే ప్రసంగం చేసిన తర్వాతే పహల్గాం దాడి జరిగింది. మరోవైపు ఇదే సమయంలో పాక్ వాయుసేనకు చెందిన రవాణా, నిఘా విమానాలను కరాచీ నుంచి లాహోర్, రావల్పిండి బేస్లకు తరలించారు. ఇదంతా భారత్తో ఢీకొట్టడానికి పాక్ చేస్తున్న ప్రయత్నమా? అనే అనుమానాలను బలపరుస్తోంది.
దాడి చేసింది పాకిస్థాన్ SSG కమాండోలు- హమాస్ తరహా ఎటాక్: JK మాజీ డీజీపీ
'నిన్ను చంపను, వెళ్లి మీ మోదీకి చెప్పుకో'- మహిళకు ఉగ్రవాది వార్నింగ్!