PAKISTAN PEOPLE LEAVING INDIA: పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పౌరులు 48 గంటల్లోగా భారత్ వీడాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వివిధ పనులు నిమిత్తం పాక్ నుంచి భారత్ కు వచ్చిన వారు తమ స్వస్థలానికి తిరిగి వెళ్తున్నారు. బరేలీ, దిల్లీ, పంజాబ్, జమ్ముకశ్మీర్లో ఉన్న పాకిస్థానీయులు తమ దేశానికి బయలుదేరారు.
బరేలీలో 34 మంది
గత కొన్ని నెలలుగా దీర్ఘకాలిక వీసాపై ఉత్తర్ప్రదేశ్లోని బరేలీలో 34 మంది పాకిస్థానీయులు నివసిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో వారు తమ స్వస్థలానికి బయలుదేరుతున్నారు. ఇందులో షహనాజ్ అనే పాకిస్థానీ మహిళ కూడా ఉంది. ఆమె వీసా, ఇతర పత్రాలను పోగొట్టుకుంది. ఈ క్రమంలో 45 రోజుల వీసాపై భారత్కు వచ్చిన షహనాజ్, ఇప్పుడు పాకిస్థాన్ ఎలా తిరిగి వెళ్లాలోనని ఆందోళన చెందుతోంది. అయితే భారత ప్రభుత్వం ఇచ్చిన ఏ ఆదేశాలనైనా తాను పాటిస్తానని చెబుతోంది.
వీసా, పత్రాలను పొగొట్టుకున్న మహిళ
40 ఏళ్ల క్రితం పాకిస్థాన్కు చెందిన వ్యక్తిని షహనాజ్ పెళ్లాడింది. ఈ ఏడాది మార్చిలో 45 రోజుల వీసాపై భారత్కు తిరిగొచ్చింది. షహనాజ్ తల్లి బరేలీలోని బారాదరిలో ఉంటోంది. ఆమె తన తల్లిదండ్రులను కలవడానికి అప్పుడప్పుడు భారత్ వస్తుంటుంది. మార్చిలో పాక్ నుంచి వస్తుండగా రైలులో ఆమె పర్సును దొంగిలించారు. అందులోనే పాస్ పోర్ట్ సహా ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. ఈ క్రమంలో బరేలీలోని జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు.
"పాకిస్థాన్ మహిళ షహనాజ్ పర్సు రైలులో పోయిందని ఫిర్యాదు చేసింది. ఆమె ముఖ్యమైన పత్రాలు కూడా పోయాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని అనుసరించి తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం 34 మంది పాకిస్థానీయులు బరేలీలో దీర్ఘకాలిక వీసాపై నివసిస్తున్నారు. షహనాజ్ 45 రోజుల వీసాపై అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూడటానికి వచ్చింది. " అని బరేలీ ఎస్పీ అనురాగ్ ఆర్య తెలిపారు.
చాలా బాధగా ఉంది : పాక్ టూరిస్టులు
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సరిహద్దైన అట్టారి-వాఘా బార్డర్ను మూసివేశారు. ఈ క్రమంలో దిల్లీ నుంచి పాక్కు వెళ్తున్న పౌరులు కీలక వ్యాఖ్యలు చేశారు. 45రోజుల వీసాపై ఏప్రిల్ 15వ తేదీన కరాచీ నుంచి భారత్కు వచ్చామని చెబుతున్నారు. కానీ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు తాము పాకిస్థాన్కు తిరిగి వెళ్తున్నామని చెప్పారు. ఇలా పర్యటన మధ్యలోనే వెళ్లడం తమకు చాలా బాధగా ఉందని అన్నారు.
"మేము ద్వేషాన్ని కోరుకోవడం లేదు. ఇరు దేశాల మధ్య ప్రేమను కోరుకుంటున్నాం. పహల్గాంలో జరిగిన సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత్, పాక్ ప్రజలు పరస్పరం సామరస్యంతో ఉండాలి. వారి మధ్య ద్వేషం ఉండకూడదు. ద్వేషంతో ఏమీ సాధించలేం. రెండు దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలను పరస్పర సహకారం ద్వారానే పరిష్కరించుకోవాలి." అని పాకిస్థాన్ పౌరులు తెలిపారు.