India Pakistan Border Fire : పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దు వెంబడి మరోసారి కాల్పుల కలకలం కొనసాగుతోంది. పాకిస్థాన్ సైన్యం వరుసగా నాలుగో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు దిగింది. పూంఛ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు పాల్పడినట్లు సోమవారం సైనిక వర్గాలు తెలిపాయి. దీన్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని పేర్కొన్నాయి.
'ఏప్రిల్ 27-28 అర్ధరాత్రి సమయంలో కుప్వారా, పూంఛ్ జిల్లాల్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. వీటికి భద్రతా దళాలు వేగంగా స్పందించి పాక్ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఇలా కాల్పులకు పాల్పడటం వరుసగా నాలుగో రోజు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు' అని భారత్ సైన్యం సోమవారం తెలిపింది. అయితే పూంఛ్ సెక్టార్లో పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు.
During the night of 27-28 April 2025, Pakistan Army posts initiated unprovoked small arms fire across the Line of Control in areas opposite Kupwara and Poonch districts. Indian troops responded swiftly and effectively: Indian Army
— ANI (@ANI) April 28, 2025
ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్, పాకిస్థాన్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడం, పాక్ పౌరులు భారత్ను విడిచి వెళ్లాలని గడువు విధించడం వంటి చేసింది. ఈ చర్యలతో పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతోపాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది. తమ గగనతలంలో భారత్కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. అలాంటి పరిణామాల వేళ సరిహద్దుల్లో కాల్పులు జరగడం కలకలం రేపుతోంది.
పాక్ పౌరులకు భారత్ ప్రభుత్వం విధించిన గడువు ఆదివారంతో ముగిసింది. దీంతో ఇప్పటివరకు 537 మంది పాకిస్థానీయులు అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో స్వదేశానికి వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీరిలో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు తెలిపాయి. మరోవైపు 850 మంది భారతీయులు పాకిస్థాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.