Pakistan Hackers Failure : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ మరింతగా బరి తెగించింది. ఓ వైపు సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట నిరంతరాయంగా కాల్పులకు తెగబడుతున్న పాక్, మరోవైపు భారత్ సైన్యానికి చెందిన డిజిటల్ వేదికలపై సైబర్ దాడులు చేయిస్తోంది. భారత సైన్యానికి చెందిన జాతీయ స్థాయి పోర్టల్స్ను హ్యాక్ చేయడం అసాధ్యమని గుర్తించిన పాక్ సైబర్ మూకలు సైన్యం సంక్షేమ సంస్థలు, విద్యాసంస్థలకు చెందిన వెబ్సైట్లపైకి తెగబడుతున్నారు.
'ఇంటర్నెట్ ఆఫ్ ఖిలాఫా' (IOK హ్యాకర్) అనే పేరు కలిగిన హ్యాకింగ్ గ్రూపు ఈ సైబర్ దాడులను చేస్తోందని భారత ఆర్మీ వర్గాలు గుర్తించాయి. ఆర్మీ పబ్లిక్ స్కూల్ శ్రీనగర్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ రాణీఖేత్, ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ (AWHO), భారత వైమానిక దళం ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ పోర్టల్లను IOK హ్యాకర్ గ్రూప్ హ్యాక్ చేసింది. అయితే భారతదేశపు లేయర్డ్ సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ వెంటనే ఈ హ్యాకింగ్ వ్యవహారాలను గుర్తించింది. హ్యాకర్లు పాకిస్థాన్ కేంద్రంగానే ఈ ఆగడాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకుంది.
సమాచారాన్ని మాయం చేసేందుకు
ఈ నాలుగు వెబ్సైట్ల హ్యాకింగ్ ఘటనలను అడ్డుకొని వాటికి సంబంధించిన సమాచారాన్ని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. ఆ నాలుగు వెబ్సైట్లలోని పేజీలలో ఉన్న సమాచారాన్ని మాయం చేసేందుకు, వాటి సేవలకు అంతరాయం కలిగించడానికి, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి పాక్ సైబర్ మూకలు విఫలయత్నం చేశారు.
ఈ హ్యాకింగ్ యత్నాల వల్ల భారత ఆర్మీకి చెందిన ఆయా వెబ్సైట్ల సమాచారమేదీ తస్కరణకు గురికాలేదు. సదరు వెబ్సైట్ల పరిధిలోని నెట్వర్క్ కూడా ప్రతికూలంగా ప్రభావితం కాలేదని సమాచారం. సైనికులు, వారి -కుటుంబాల సంక్షేమంతో ముడిపడిన వెబ్సైట్లకు మెరుగైన సైబర్ రక్షణ కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
ఐదు రోజులుగా కాల్పుల పర్వం
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీరులో పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి. ఇరుదేశాల సైన్యాలు పరస్పరం కాల్పులకు దిగుతున్నాయి. వరుసగా ఐదు రోజులుగా ఈ విధంగా కాల్పులు కొనసాగుతుండటంపై పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకొన్ని వారాల్లో సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్రరూపు దాల్చే ముప్పు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కశ్మీర్లోని మొత్తం 87 టూరిస్టు కేంద్రాల్లో 48 కేంద్రాలను భారత ప్రభుత్వం మూసివేసింది. పహల్గాం దాడి తర్వాత కశ్మీర్లో ఉగ్రవాద స్లీపర్సెల్స్ యాక్టివేట్ అయ్యాయని, మరిన్ని ఉగ్ర దాడులు జరగొచ్చని భారత నిఘా వర్గాల నుంచి సమాచారం అందడం వల్ల ఈమేరకు చర్యలు తీసుకున్నారు. జమ్మూకశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల ఇళ్లను భారత సైన్యం పేల్చేస్తోంది. దీనికి ప్రతీకారంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళిక రచిస్తున్నారని సమాచారం అందిందని నిఘా వర్గాలు వెల్లడించాయి.
జమ్ముకశ్మీర్లో 48పర్యటక ప్రాంతాల మూసివేత- ఉగ్రదాడులు జరగొచ్చని వార్నింగ్
'ఎప్పుడైనా, ఎక్కడైనా రెడీ' - పాకిస్థాన్కు ఇండియన్ నేవీ స్ట్రాంగ్ మెసేజ్!