Pakistan ex MP Divaya Ram in India : పాకిస్థాన్ మాజీ ఎంపీ ప్రస్తుతం భారత్లో ఐస్క్రీములు అమ్ముకుంటున్నారు. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న దివాయా రామ్, హరియాణాలోని ఫతేబాద్లో ఐస్క్రీమ్ వ్యాపారం చేసుకుంటున్నారు. 25ఏళ్ల క్రితం భారత్కు వచ్చిన ఆయన ఇక్కడే స్థిరపడిపోయారు. తాజాగా భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వీసాలు రద్దు చేయగా ఈయన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అసలు ఆయన భారత్కు ఎందుకు వచ్చారు? ఐస్క్రీములు ఎందుకు అమ్ముకుంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.
పాకిస్థాన్కు చెందిన దివాయా రామ్ 1989లో మైనార్టీల రిజర్వ్ స్థానంలో ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా ఆయన కుటుంబంపై దాడులు మాత్రం ఆగలేదు. ఒకసారి దివాయా రామ్ కూతురిని కిడ్నాప్ చేసినా, ఆయన ఏం చేయలేకపోయారు. దీంతో ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఎంపీ పదవికి రాజీనామా చేసి కుటుంబంతో సహా భారత్కు వచ్చేశారు. భార్య రాజో రాణి, 8మంది కుమారులు, ఇద్దరు కూతుళ్లు సహా 13 మంది వచ్చారు. ఆ తర్వాత ఒక కుమార్తె జన్మించగా, ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యుల సంఖ్య 30కి చేరింది. తొలుత నెల రోజుల టూరిస్ట్ వీసాతో వచ్చిన ఆయన, తర్వాత ప్రతి ఏడాది రెన్యూవల్ చేసుకుంటూ వస్తున్నారు. అనంతరం ఐదేళ్లకు ఆయన వీసాను 2018 వరకు పొడిగించారు.

"భారత్కు వచ్చిన కొత్తలో రోహ్తక్లోని మదీనా గ్రామంలో నివసించేవాళ్లం. ఆ తర్వాత 2008లో ఫతేబాద్లోని రతన్గఢ్కు మకాం మార్చాం. ఇక్కడే నా ముగ్గురు కుమార్తెలు, 8 మంది కుమారుల వివాహం చేశాను. ప్రస్తుతం నా కుటుంబం రతన్గఢ్లో ఐస్క్రీమ్ వ్యాపారం చేస్తుంది. మా తాత పేరిట ఇప్పటికీ పాకిస్థాన్లోని బఖార్ జిల్లాలో 25 ఎకరాల భూమి ఉంది. ఇక్కడే నా కుటుంబ సభ్యులకు ఆధార్ కార్డు, గుర్తింపు పత్రాలు వచ్చాయి."
--దివాయా రామ్, మాజీ ఎంపీ పాకిస్థాన్
2018 వరకు వీసాతో ఉన్న దివాయా రామ్ కుటుంబం శరణార్థిగా భారత్లోనే ఉంటున్నారు. అనంతరం 2018లో వీసా గడువు పెంపునకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత తన వీసా గడుపు పెంచడానికి స్థానిక నేతలతో పాటు అందరి చూట్టూ తిరిగారు. CAA చట్టం ద్వారా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వీరి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే పౌరసత్వం కోసం దివాయా రామ్ బీజేపీ అధ్యక్షుడు మోహన్లాల్ బరోలిని కలిశారు. తన కుటుంబం పాకిస్థాన్ తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా లేదని పౌరసత్వం ఇప్పించేందుకు సాయం చేయాలని కోరారు. అక్కడికి వెళ్తే తన కుటుంబాన్ని అక్కడి ముస్లింలు వేధిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌరసత్వం కోసం ఇంతకుముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు సందీప్ దీక్షిత్ సహా అనేక మందిని కలిసి కోరినట్లు తెలిపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ, మాజీ హోం మంత్రి ఎల్కే అడ్వాణీకి సైతం లేఖ రాసినట్లు చెప్పారు.
పాకిస్థాన్లో వేధింపులు తాళలేక దివాయా రామ్ బంధువు రామ్ ప్రకాశ్ కుటుంబం కూడా 2006లో భారత్కు వచ్చి స్థిరపడింది. ఫతేబాద్లోని సర్దావాలాకు వచ్చి స్థిరపడి, ఇక్కడే వివాహం చేసుకున్నాడు. అనంతరం అతడి కుటుంబంలోని ఆరుగురికి భారత పౌరసత్వం దక్కగా, ఇంకా కొందరివి ప్రాసెస్లో ఉన్నాయి. కాగా, జమ్ము కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ వీసాలను రద్దు చేసింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే భారత్ విధించిన ఆంక్షల కారణంగా ఇప్పటి వరకు 786 మంది పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దాటి పాకిస్థాన్కు తిరిగి వెళ్లిపోయారు. అదే సమయంలో అక్కడ నుంచి 1,367మంది పౌరులు భారత్ తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
భారత్ను వీడిన 786 పాక్ పౌరులు- ఇండియాకు ఎంతమంది వచ్చారంటే?