Pahalgam Terror Attack : జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రమంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అధికారులను భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓవైపు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు మమ్మురంగా గాలింపు చర్యలు సాగుతున్నాయి. మరోవైపు కేంద్రమంత్రులు తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
శ్రీనగర్ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు
కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్నాయుడు తాజాగా కీలక ప్రకటన చేశారు. పర్యాటకుల భద్రత మేరకు వారి కోసం శ్రీనగర్ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగు ప్రత్యేక విమానాలు శ్రీనగర్ నుంచి ముంబయి, దిల్లీకి చేరుకుంటాయని చెప్పారు. ఆ విషయంపై మంగళవారం హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడానని తెలిపారు.
అవసరమైతే మరిన్ని విమానాలు నడపడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులోభాగంగా మంత్రి అన్ని విమానయాన ఆపరేటర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇలాంటి సమయంలో ప్రయాణికులపై భారం పడకుండా సాధారణ స్థాయి ఛార్జీలను వసూలు చేయాలని విమానయాన సంస్థలను ఆదేశించారు. మరణించిన వ్యక్తుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని పనిచేస్తూ పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు.
DGCA స్పెషల్ రిక్వెస్ట్
శ్రీనగర్కు వెళ్లే విమానాలను పెంచాలని DGCA పలు విమానయాన సంస్థలను కోరింది. అదే సమయంలో శ్రీనగర్ పర్యాటకులకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది ఇండిగో సంస్థ. విమాన టికెట్లు రీషెడ్యూల్, కాన్సలేషన్ ఛార్జీలను రద్దు చేసింది. శ్రీనగర్కు 2 ప్రత్యేక సర్వీసులు కూడా నడుపుతున్నామని బుధవారం వెల్లడించారు.
రూ.10లక్షల పరిహారం ప్రకటన
పహల్గాం ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మరోవైపు పహల్గాంలో కాల్పులు జరిగిన ప్రదేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరిశీలించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. అందుకోసం బుధవారం ఉదయం శ్రీనగర్కు చేరుకున్నారు. అనంతరం పుష్ప గుచ్ఛాలతో శ్రద్ధాంజలి ఘటించారు.
హెల్ప్ లైన్ ఏర్పాటు
ఉగ్రవాద దాడిలో కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారని ఆ రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. అక్కడి నుంచి పర్యటకులను తీసుకురావడానికి హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా పర్యటకుల వివరాలను రాబట్టేలా చర్యలు తీసుకుంది. మరణించిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులతో పాటు బుధవారం మధ్యాహ్నం తిరిగి తీసుకురావాలని నిర్ణయించింది.
చిక్కుకున్న 50 మంది పర్యాటకులు
పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో గోవాకు చెందిన 50 మందికి పైగా పర్యాటకులు జమ్ముకశ్మీర్లో చిక్కుకున్నారు. వారంతా శ్రీనగర్లోని హోటళ్లలో చిక్కుకుపోయారని, వారిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని చెప్పారు. టూర్ ఆపరేటర్లు ప్రణాళికలు రూపొందిస్తున్నారని వెల్లడించారు.
'నిన్ను చంపను, వెళ్లి మీ మోదీకి చెప్పుకో'- మహిళకు ఉగ్రవాది వార్నింగ్!
పహల్గాంలో ఉగ్రమూకను ఫస్ట్ చూసింది ఈ రైతే- ఏం జరిగిందో పూసగుచ్చినట్లు!
కొత్త జంటల జీవితాన్ని చిదిమేసిన ఉగ్రవాదులు- భార్యల కళ్లెదుటే భర్తల తలలపై కాల్చి!