Pahalgam Attack Terrorists Sketches : పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసిన ముగ్గురి ఉగ్రవాదుల స్కెచ్లను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించారు. మూసా, యూనిస్, ఆసీఫ్ అనే కోడ్నేమ్లు కూడా ఉన్నట్లు తెలిపారు. ఆ ముగ్గురు పూంఛ్లో జరిగిన ఉగ్రవాద దాడుల ఘనటల్లో కూడా ఉన్నట్లు తెలిపారు. ఉగ్రదాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఈ చిత్రాలను తయారు చేసినట్లు భద్రతా సంస్థలు తెలిపాయి.



ఉగ్రవాదులను హతమార్చేందుకు, ఆ భయంకర దాడి వెనుక ఉన్న క్రూరమైన ప్రణాళికను వెలికితీసేందుకు భద్రతా సంస్థలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రదాడికి బాధ్యత వహించింది. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఈ స్కెచ్లు కీలకం కానున్నాయి. జమ్ముకశ్మీర్లో ఉన్న స్థానికులు ఎవరైనా ఇందులో కనిపిస్తున్న వారి ఆచూకీ తెలపాలని పోలీసులు కోరారు.
లష్కరే తోయిబా ముసుగు సంస్థ
పహల్గాం దాడికి వెనుక లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన కమాండర్ సైఫుల్లా కుసురీ అలియాస్ ఖలీద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇతనితోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని మరికొందరు ఆపరేటీవ్లు కూడా ఈ దాడికి సహకరించినట్లు సమాచారం. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ పాక్ సైన్యానికి అనుబంధంగా పనిచేస్తుంటుంది. లష్కరే సంస్థకు 'ది రెసిస్టెన్స్ ఫోర్స్' అనేది ముసుగు సంస్థ అని తెలుస్తోంది. వారు పహల్గాంలో మారణ హోమం సృష్టించి, దానిని కెమెరాల్లో చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.