Tamil nadu BJP President Election : తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ నేత, తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్లు ఈ మేరకు ప్రకటించారు. నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం వల్ల ఆయనకే ఈ పదవి ఖరారైంది. కాగా, అంతకుముందు రాష్ట్ర అధ్యక్ష పదవికి నాగేంద్రన్ పేరును కె.అన్నామలై, కేంద్రమంత్రి ఎల్.మురుగన్, కేంద్ర మాజీ మంత్రి పోన్ రాధాకృష్ణన్, మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ ప్రతిపాదించారు. ఈ ఎన్నిక వెనక కేంద్ర మంత్రి అమిత్ షా నిర్ణయాలు కీలకంగా పనిచేసినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, అన్నాడీఎంకేలు జట్టుకట్టిన వేళ ఈ పరిణామం జరిగింది.
1960లో కన్యాకుమారి జిల్లా నాగర్కొయిల్ సమీపంలోని వడివీశ్వరంలో నాగేంద్రన్ జన్మించారు. ముందు అన్నాడీఎంకేలో కీలకంగా ఉన్న ఆయన అనంతరం బీజేపీలో చేరారు. 2020 జులై నుంచి కమలం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జయలలిత, పన్నీరుసెల్వం ప్రభుత్వాల్లో పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ప్రభుత్వ పాలన, ప్రజలతో మేమకం, రాజకీయాల్లో వ్యూహాలపై పట్టు ఉండటం వల్ల అధిష్ఠానం ఆయన వైపు మొగ్గుచూపినట్లు విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. దీంతో పాటు అన్నాడీఎంకే, బీజేపీలను సమన్వయం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తారని భావిస్తున్నారు.
అన్నాడీఎంకే, బీజేపీ మధ్య కుదిరిన పొత్తు
శుక్రవారం తమిళనాడులో పర్యటించిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పొత్తుపై కీలక ప్రకటన చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించినట్లు షా ప్రకటించారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధ్యక్షుడు పళనిస్వామి నేతృత్వంలో పనిచేస్తామని స్పష్టం చేశారు. కొన్ని అంశాల్లో అన్నాడీఎంకే వైఖరి భిన్నంగా ఉన్నా, చర్చల ద్వారా కనీస ఉమ్మడి ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తామని వెల్లడించారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము తలదూర్చబోమని చెప్పారు. అధికారం, సీట్ల పంపకాలపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.