Groom Wanted To Marry Bride Sister : మధ్యప్రదేశ్లోని రేవాలో ఓ పెళ్లికొడుకు వింత వాదన చేశాడు. పెళ్లి కూతుర్ని పెళ్లి చేసుకోనని, ఆమె చెల్లెలి మెడలో మూడు ముళ్లు వేస్తానని అన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన వధువు ఆత్మహత్మయత్నం చేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
అసలేం జరిగిందంటే?
మాంగవన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ యువతికి, సిద్ధికి గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఏప్రిల్ 18న వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. అందుకు తగ్గట్లు ఇరువురి ఇంట్లో పెళ్లి సన్నాహాలు చేసుకున్నారు. ఏప్రిల్ 16న తిలకోత్సవ్ ( వధువుకు బొట్టు పెట్టే) కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. అందరూ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.
పెళ్లికి ముందు రోజు షాక్
అయితే పెళ్లికి ఒకరోజు ముందు (ఏప్రిల్ 17న) వరుడు వధువు తండ్రికి ఫోన్ చేశాడు. "మీ చిన్న కూతురు అంటే నాకు ఇష్టం. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీ పెద్ద కూతురిని నేను వివాహం చేసుకోను" అని చెప్పాడు. దీంతో అంతా ఒక్కసారి షాక్ అయ్యారు. పెళ్లికి ముందు రోజు అలాంటి వింత డిమాండ్ చేయడం వల్ల అమ్మాయి తరఫువారు ఆశ్చర్యపోయారు. వరుడి డిమాండ్ విని కాబోయే వధువు మనస్తాపానికి గురైంది. దీంతో ఆత్మహత్యాయత్నం చేసింది.
ప్రాణానికి తప్పిన ముప్పు!
బలవన్మరణానికి యత్నించిన వధువుని వెంటనే సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి వధువు బయటిపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం సంఘటనలో వరుడు, వధువు తరఫున వారు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. వధువుకి కొన్నేళ్ల క్రితం వేరే వ్యక్తితో వివాహమైందని, విడాకులు కూడా తీసుకుందని వరుడు తరఫు వారు ఆరోపించారు. ఈ విషయాన్ని తమకు చెప్పకుండా దాచిపెట్టారని అన్నారు.
భిన్న వాదనలు- పరస్పర ఆరోపణలు
అయితే పెళ్లి కూతురు తరఫు వారి వాదన మరోలా ఉంది. వధువు విడాకుల గురించి తాము మధ్యవర్తి ద్వారా ఇప్పటికే వరుడు కుటుంబ సభ్యులకు తెలియజేశామని చెబుతున్నారు. ఈ విషయం తెలిసే వరుడు పెళ్లికి సిద్ధమయ్యాడని, ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు, వధువు ఆత్మహత్యయత్నానికి పాల్పడడంపై రేవా ఎస్పీ వివేక్ సింగ్ స్పందించారు. "వివాహం ఆగిపోయిన తర్వాత పెళ్లి కూతురు ఆత్మహత్యయత్నం చేసింది. అయితే ఆమె ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతోంది. యువతి వాంగ్మూలాన్ని నమోదు చేశాం. ఆమె కుటుంబం కూడా వరుడిపై ఫిర్యాదు చేసింది. ప్రాథమిక దర్యాప్తులో వధువు గతంలో విడాకులు తీసుకున్నట్లు తేలింది. ఈ విషయాన్ని తమకు తెలియకుండా దాచిపెట్టారని వరుడి తరపు వారు చెబుతున్నారు. వధువు తరపు వారు మొత్తం విషయం చెప్పామని అంటున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం" అని వివేక్ సింగ్ తెలిపారు.
డెడ్బాడీని ముక్కలుగా కోసి షాపులోనే పాతిపెట్టి! 'దృశ్యం 2' మించిన క్రైమ్ థ్రిల్లర్!
రూ.200 కోసం కన్నతల్లిని చంపిన కొడుకు- అంతా కుక్క పిల్ల కోసమే!