Mother Meet Son After 15 Years : 15 ఏళ్ల క్రితం అయినవారికి దూరమైన ఓ యువకుడు, ఎట్టకేలకు తన కుటుంబసభ్యుల్ని కలుసుకున్నాడు. అనుకోకుండా తప్పిపోయిన ఆ వ్యక్తి తాజాగా తన తల్లిని కలిశాడు. దీంతో తల్లీకొడుకుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. కొడుకును చూసిన ఆనందంలో తల్లి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ ఘటన బిహార్లో భాగల్ పుర్లో జరిగింది.
అసలేం జరిగిందంటే?
భాగల్పుర్ జిల్లాలోని మహేశ్ పుర్ డియోరి గ్రామానికి చెందిన బద్రీ మండల్ కుమారుడు సాగర్ 15 ఏళ్ల క్రితం పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా తప్పిపోయాడు. అప్పటికి సాగర్ వయసు 11 ఏళ్లు. ఆ తర్వాత అతడి ఆచూకీ కోసం సాగర్ తల్లి ఝాజీ దేవి, కుటుంబ సభ్యులు వెతికారు. ఎప్పటికీ అతడు ఎక్కడున్నాడో తెలియలేదు. దీంతో తీవ్ర బాధలో కూరుకుపోయారు. అయితే హామ్ రేడియో సభ్యుల సాయంతో సాగర్ తన ఇంటికి చేరుకున్నాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఆనందంలో తేలిపోయారు.

కుటుంబ సభ్యులకు అప్పగించిన హామ్ రేడియో సభ్యులు
2019లో సాగర్ మండల్ గురించి తమకు తెలిసిందని హామ్ రేడియా నేతృత్వంలోని బంగాల్ రేడియో క్లబ్ కార్యదర్శి అంబరీశ్ నాగ్ బిశ్వాస్ వెల్లడించారు. అప్పటికే సాగర్ మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పారు. "హౌరా జిల్లాలోని ధూలాఘర్ ట్రక్ టెర్మినల్ సమీపంలో సాగర్ కొన్నేళ్లు నివసించాడు. 2019లో ఓ రోజు రాత్రి సాగర్ ను ట్రక్కు ఢీకొట్టింది. అప్పుడు జగదీశ్ జానా అనే వ్యక్తి సాగర్ ను హౌరా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాడు. అక్కడే సాగర్ కు చికిత్స పొందాడు. మా హామ్ రేడియో సభ్యులు అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించాం. అతని పేరు, అడ్రస్ అడిగాను. కానీ సాగర్ చెప్పలేకపోయాడు. ఈ ఏడాది ఓ రోజు సామాజిక కార్యకర్త ఆశా మాంఝీ సాగర్ ను కలిశారు. ఆమెకు సాగర్ తన పేరు, చిరునామా, పొరుగు గ్రామం పేరు చెప్పాడు. అప్పుడు అతడి చిరునామా తెలిసింది" అని అంబరీశ్ నాగ్ బిశ్వాస్ తెలిపారు.

"తాము సాగర్, సామాజిక కార్యకర్త ఆశా సంభాషణను రికార్డ్ చేసి హామ్ రేడియో ద్వారా ప్రసారం చేశాం. చాలా రోజులు వేచి ఉన్నాం. అయినా ఎటువంటి స్పందనలేదు. ఆఖరికి సాగర్ సొంతూరు గురించి తెలియగానే వారి కుటుంబ సభ్యుల్ని కలిశాం. సాగర్ బతికే ఉన్నాడని అతడి తల్లికి తెలియజేశాం. సాగర్ బతికున్నాడని అతడి తల్లి, సోదరుడు నమ్మలేదు. ఆఖరికి పోలీసు అధికారి చెబితే నమ్మారు. ఆ తర్వాత బంగాల్ హౌరా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి సాగర్ను అతడి కుటుంబీకులు తీసుకెళ్లారు. అధికారులు, పోలీసుల సమక్షంలో సాగర్ ను అతడి తల్లికి అప్పగించాం"
--అంబరీశ్ నాగ్ బిశ్వాస్, బంగాల్ రేడియో క్లబ్ కార్యదర్శి
సాగర్కు పిండప్రదానం
సాగర్ ఆచూకీ తెలియకపోవడం వల్ల అతడు చనిపోయాడని కుటుంబ సభ్యులు భావించారు. ఐదేళ్ల క్రితం హిందూ సంప్రదాయం ప్రకారం పిండప్రదానం చేశారు. అయితే సాగర్ మళ్లీ తిరిగి ఇంటికొచ్చేసరికి సంతోషపడ్డారు.
తల్లి కళ్లలో ఆనందం
సాగర్ చిన్నప్పుడే అతడి తండ్రి బద్రి పిడుగు పడి మరణించాడు. ఆ తర్వాత సాగర్, అతడి సోదరుడు ప్రమోద్ ను తల్లే పెంచింది. దీంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఆఖరికి సాగర్ ను హౌరా ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు కూడా అతడి తల్లి ఝాజీ దేవి దగ్గర డబ్బులు లేవు. దీంతో హామ్ రేడియో సభ్యులు సాయం చేశారు. దీంతో కుమారుడ్ని ఇంటికి తీసుకొచ్చింది. "నా భర్త మరణించినప్పటి నుంచి నా ఇద్దరు కుమారుల్ని కష్టపడి పెంచుతున్నాను. కానీ ఒక రోజు పొలం నుంచి తిరిగి వస్తుండగా నా చిన్న కొడుకు సాగర్ మండల్ తప్పిపోయాడు. ఇప్పుడు 15ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. చాలా సంతోషంగా ఉంది" అని సాగర్ తల్లి ఝజ్జీ దేవి తెలిపారు.